శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 18 ఆగస్టు 2017 (10:22 IST)

ఈ ప్రపంచాన్ని జయించలేకపోతున్నాను... అందుకే 'సైనింగ్‌ ఆఫ్‌' : మెడికో సూసైడ్ లేఖ

ఓ మెడికో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ప్రపంచాన్ని జయించలేకపోతున్నాననే భావనతో 20 యేళ్లు నిండని ఓ యువకుడు తనకు తానుగా మరణశాసనం రాసుకున్నాడు. చదువులో వెనుకబడ్డాననే ఆత్మన్యూనత.. అతని బలవన్మరణానికి కారణమైం

ఓ మెడికో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ప్రపంచాన్ని జయించలేకపోతున్నాననే భావనతో 20 యేళ్లు నిండని ఓ యువకుడు తనకు తానుగా మరణశాసనం రాసుకున్నాడు. చదువులో వెనుకబడ్డాననే ఆత్మన్యూనత.. అతని బలవన్మరణానికి కారణమైంది. అనంతపురంలో చోటుచోసుకున్న ఈ విషాదకర సంఘటన వివరాలను పరిశీలిస్తే.. 
 
హిందూపురంలోని ఆర్టీసీ బస్టాండ్‌ వెనుక చంద్రశేఖర్‌ - సుమతి అనే దంపతులు నివశిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. కుమారుడు జి. యశ్వంత్. అనంతపురం ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కుమార్తె నాగ తేజశ్వని సైతం వైద్య వృత్తిపై మక్కువతో ఎంసెట్‌ లాంగ్‌ టర్మ్‌ కోచింగ్‌ తీసుకుంటోంది. 
 
అయితే, మొదటి సంవత్సరం పరీక్షలు ముగిసే చివరి రోజు గురువారం వైద్య విద్యార్థి జి.యశ్వంత్‌ మహేంద్ర కుమార్‌ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఈ నెల 8 నుంచి థియరీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. బయోకెమిస్ట్రీ పేపర్‌–1, 2, అనాటమీ పేపర్‌–1, 2, ఫిజియాలజీ–1 పరీక్షలను యశ్వంత్‌ రాశాడు. అనాటమీ పేపర్‌–2 పరీక్ష ముగిశాక సరిగ్గా రాయలేదని తోటి విద్యార్థులతో చెప్పాడు. అయితే అందరూ ధైర్యం చెప్పారు. 
 
చదువులో చురుగ్గా ఉండే అతడు ఎక్కడ తక్కువ మార్కులు వచ్చి ఫెయిల్‌ అవుతానోనని భయపడేవాడని తెలిసింది. ఈ క్రమంలోనే మూడ్రోజుల క్రితం ‘టెన్షన్‌’ పడుతుండడంతో తండ్రి చంద్రశేఖర్‌ కళాశాలలోని హాస్టల్‌కు వచ్చి ధైర్యం చెప్పారు. సీనియర్లు, అధ్యాపకులు సైతం మనోధైర్యం నింపే ప్రయత్నం చేశారు. కానీ ఇవేమీ అతడి బుర్రకెక్కలేదు. 
 
గురువారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో హాస్టల్‌ నుంచి ‘పెద్దమ్మ’ ఇంటికి వెళ్తున్నానని బయటకు వచ్చాడు. ఎక్కడికెళ్లాడో తెలియదు గానీ ఉదయానికి విగతజీవిగా మారాడు. సూసైట్‌ నోట్‌ రాసి రాంనగర్‌ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ లేఖలో "నా చావుకు ఎవరూ బాధ్యులు కాదు.. నా తల్లిదండ్రులు నన్ను ఎంతగానో సపోర్ట్‌ చేశారు. కానీ నేను ఈ ప్రపంచాన్ని జయించలేకపోతున్నాను.. అందుకే ‘సైనింగ్‌ ఆఫ్‌" అంటూ యశ్వంత్‌ రాసిన లేఖలో పేర్కొన్నాడు. ఈ వైద్య విద్యార్థి మరణం కుటుంబీకులనే కాకుండా, సాటి వైద్య విద్యార్థులను తీవ్ర విషాదంలోకి నెట్టింది.