మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 15 నవంబరు 2018 (10:16 IST)

దేశ ప్రధానిని నిర్ణయించేది మా డాడీనే : నారా లోకేశ్

వచ్చే సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత దేశ ప్రధానమంత్రిని ఎంపిక చేసేది తన తండ్రి, ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడేనని ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ జోస్యం చెప్పారు. ప్రస్తుతం ఆయన దుబాయ్ పర్యటన బిజీబిజీగా సాగుతోంది. 
 
అక్కడి ఎన్ఆర్ఐ టిడిపి విభాగం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర విభజన కారణంగా కట్టుబట్టలతో వచ్చేశామని.. 16 వేల కోట్ల లోటు బడ్జెట్‌తో ఏపీ ప్రయాణం మొదలుపెట్టామని లోకేశ్ గుర్తుచేశారు. రాజధాని ఎక్కడో తెలీని పరిస్థితుల్లో.. రైతులు 35 వేల ఎకరాలు ఇచ్చి చరిత్ర సృష్టించారన్నారు. విభజన చేసిన వారు అసూయపడేలా అమరావతి నిర్మాణం జరుగుతుందని స్పష్టంచేశారు.
 
నదుల అనుసంధానంపై దేశమంతా మాట్లాడుతుంటే.. ఏపీ ముఖ్యమంత్రి ఆచరణలో చూపించారన్నారు. గోదావరి జలాలను పెన్నానదికి తీసుకెళ్తున్నామన్నారు. కరువును చూసి రైతులు భయపడే రోజులు పోతాయన్నారు. వ్యవసాయ రంగం అభివృద్ధిపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టినట్టు చెప్పారు. 
 
ఆంధ్రప్రదేశ్‌లో నీటి కొరత లేకుండా చేసామన్నారు. దీంతో పెద్ద కంపెనీలు క్యూ కడుతున్నాయని అన్నారు. కరువు జిల్లా అనంతపురానికి కియా మోటార్స్‌ రావడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఐటి రంగమంతా హైదరాబాద్‌లో ఉండిపోయినా.. 2019 నాటికి ఏపీలో లక్ష ఐటీ ఉద్యోగాల కల్పన టార్గెట్‌గా పెట్టుకుని పని చేస్తున్నామని తెలిపారు. 
 
ఎన్నారైలు బ్రాండ్ అంబాసిడర్లుగా మారి ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిని ప్రచారం చెయ్యాలని లోకేష్‌ కోరారు. ఎన్నారైల సమస్యల పరిష్కారానికి ఏపీఎన్ఆర్టీని కూడా ఏర్పాటుచేశామని తెలిపారు. తెలుగువారు ఎక్కడ, ఏ సమస్య ఎదుర్కొన్నా, పరిష్కారం కోసం చంద్రబాబు ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందన్నారు.