శుక్రవారం, 27 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 27 సెప్టెంబరు 2024 (09:56 IST)

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి క్లాసుకు ఒక టీచర్ విధానం : ఏపీ మంత్రి నారా లోకేశ్

nara lokesh in school
వచ్చే యేడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి క్లాసుకు ఒక టీచర్ విధానాన్ని అమలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖామంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఆయన గురువారం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఎచ్చెర్ల వీధిలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ ఎలిమెంటరీ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. 1 నుంచి 5వ తరగతి విద్యార్థుల తరగతి గదులను మంత్రి పరిశీలించారు. ఆ తర్వాత విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. 
 
విద్యార్థుల వర్క్ బుక్‌ను పరిశీలించిన మంత్రి చిన్నారుల హ్యాండ్ రైటింగ్ బాగుందని కితాబిచ్చారు. హ్యాండ్ రైటింగ్ మెరుగుదల కోసం కాపీ రైట్ బుక్స్ రాయిస్తున్నామని టీచర్లు చెప్పగా, వారిని అభినందించారు. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో ఇదే విధానాన్ని అమలుచేసే అంశాన్ని పరిశీలిస్తామని లోకేశ్ చెప్పారు. మధ్యాహ్న భోజనంలో స్థానిక ఆహారంపై విద్యార్థులు మక్కువ చూపుతున్నందున, వాటిని మెనూలో చేర్చే అంశాన్ని పరిశీలించాల్సిందిగా అధికారులకు సూచించారు. 
 
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుదలకు కలెక్టర్ నుంచి టీచర్ వరకు అందరూ భాగస్వామ్యం వహించాలని కోరారు. రాబోయే అయిదేళ్లలో దేశంలోనే ఆదర్శంగా ఏపీ స్కూళ్లను తీర్చిదిద్దుతామన్నారు. గత ప్రభుత్వ అనాలోచిత చర్యల కారణంగా పలు తప్పులు జరిగాయని, ఈసారి అలాంటివి చోటుచేసుకోకుండా ప్రణాళికాబద్ధంగా సంస్కరణలు అమలు చేస్తామని అన్నారు.
 
ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితులన్నింటినీ ఒకేసారి మార్చడం సాధ్యం కాదన్నారు. స్కూళ్లలోని మౌలిక సదుపాయాల వాస్తవ చిత్రాలను ఎప్పటికప్పుడు డ్యాష్ బోర్డులో అప్ లోడ్ చేయాలని ఎంఈవోను ఆదేశించారు. ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేసి నాణ్యత పెంచేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ పర్యటనలో మంత్రి లోకేశ్ వెంట ఎమ్మెల్యే గొండు శంకర్, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి ఉన్నారు.