గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PY REDDY
Last Updated : ఆదివారం, 21 డిశెంబరు 2014 (19:38 IST)

రూ.350 కోట్ల‌తో తిరుప‌తి ఆర్టీసి బ‌స్టాండు ఆధునీక‌ర‌ణ‌

తిరుప‌తి బ‌స్టాండుకు మ‌హ‌ర్ధశ ప‌ట్ట‌నున్న‌ది. రూ. 350 కోట్ల‌తో అభివృద్ధి చేయ‌డానికి ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు స‌మ్మ‌తించిన‌ట్లు రాష్ట్ర ర‌వాణాశాఖా మంత్రి సిద్ధ‌రాఘ‌వ‌రావు తెలిపారు. ఆదివారం తిరుప‌తి బ‌స్టాండును ఆయ‌న త‌నిఖీ చేశారు. గ్యారేజీ స్టోరు గ‌దిలోని రికార్డుల‌ను ప‌రిశీలించారు. అక్క‌డ రికార్డులు స‌రిగా లేక‌పోవ‌డంతో అధికారుల‌పై మండిప‌డ్డారు. వెంట‌నే బాధ్యులైన వారికి మెమో ఇవ్వాల‌ని ఆదేశించారు.

అనంత‌రం విలేక‌రుల‌తో మాట్లాడుతూ, తిరుప‌తికి వ‌చ్చి పోయే భ‌క్తుల సంఖ్య వేల‌లో ఉంటుంద‌ని దానిని దృష్టిలో పెట్టుకుని మెరుగైన సౌక‌ర్యాలు క‌ల్పించాల‌ని ఆదేశించారు. క‌నీసం తాగు నీరు, మ‌రుగుదొడ్లు స‌క్ర‌మంగా లేక‌పోతే ఎలా అని ప్ర‌శ్నించారు. 15 రోజుల లోపు సౌక‌ర్యాలు మెరుగు ప‌ర‌చాల‌ని చెప్పారు. ఇక తిరుప‌తి బ‌స్టాండును ఆధునీక‌రించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని చెప్పారు. మల్టీ ప్ల‌క్సుల నిర్మాణానికి ప్ర‌భుత్వం యోచిస్తోంద‌ని చెప్పారు.

ఈ కార్య‌క్ర‌మంలో తిరుప‌తి రీజిన‌ల్ మేనేజ‌ర్ జి.మ‌హేశ్వ‌ర్‌, చిత్తూరు డిప్యూటీ ట్రాఫిక్ మేనేజ‌రు జితేంద్రనాథ్ రెడ్డి, త‌దిత‌రులు పాల్గొన్నారు.