గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 31 జులై 2017 (07:56 IST)

తస్మదీయులపై కేసుల మీద కేసులు.. అస్మదీయులపై కొట్టివేతలు.. ఇదేం న్యాయం మిలార్డ్

రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి తన ప్రత్యర్థులపై అయినదానికి, కానిదానికి కేసులు పెడుతోందని, అదే అధికారపక్షానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలపై నమోదైన కేసులను మొత్తంగా ఉపసంహరిస్తూ జీవోల మీద జీవోలు జారీ చేస్తోందని ఆరోపిస్తూ మంగళగిరి

రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి తన ప్రత్యర్థులపై అయినదానికి, కానిదానికి కేసులు పెడుతోందని, అదే అధికారపక్షానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలపై నమోదైన కేసులను మొత్తంగా ఉపసంహరిస్తూ జీవోల మీద జీవోలు జారీ చేస్తోందని ఆరోపిస్తూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉమ్మడి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఇది రాజ్యాంగ విరుద్దమని, అధికార పార్టీ నేతలపై కేసులను ఉపసంహరించుకోవాలని వివిధ కోర్టుల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్లను ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను కొట్టేయాలని కోరుతూ ఎమ్మల్యే ఆళ్ల ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. 
 
వివరాల్లోకి వెళితే, తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలపై నమోదైన కేసులను ఉపసం హరిస్తూ ప్రభుత్వం వివిధ తేదీల్లో జారీ చేసిన పలు జీవోలను సవాలు చేస్తూ ఉమ్మడి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలైంది. వీరిపై నమోదైన కేసులకు సంబంధించి పలు కోర్టుల్లో సాగుతున్న ప్రాసిక్యూషన్‌ను ఉపసంహరించుకోవాలని ఆయా కోర్టుల పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను ఆదేశిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి, వాటిని కొట్టేయాలని కోరుతూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
 
ఇందులో హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, పలు జిల్లాల కలెక్టర్‌లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. వీరితో పాటు స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, ఉప ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి, మంత్రులు సిద్దా రాఘవరావు, దేవినేని ఉమామహేశ్వరరావు, కింజరాపు అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు, నక్కా ఆనందబాబు, ఎమ్మెల్యేలు నందమూరి బాలకృష్ణ, టీవీ రామారావు, గొల్లపల్లి సూర్యారావు, దాట్ల సుబ్బరాజు, దాసరి బాలవర్ధన రావు, చింతమనేని ప్రభాకర్, ఎ.ఆనందరావు, ఎం.అశోక్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కరణం బలరాం, రెడ్డి సుబ్రహ్మణ్యంలతో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు, కార్యకర్తలను కలిపి మొత్తం 274 మందిని వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చారు. 
 
ఎవరైనా కేసులుంటే వాటిని కొట్టివేయాలని కోరడం, పలుకుబడిని ఉపయోగించడం, రాజీకి పోవడంద్వారా తప్పించుకోవడం వంటివి చేస్తారు కానీ అధికార పక్షానికి చెందిన నేతలపై కేసులను ఉపసంహరించడానికి వ్యతిరేకంగా పిల్ దాఖలు చేయడం విడ్డూరంగా ఉంది. కానీ ప్రతిపక్షంపై కేసులు మోపడం, స్వపక్షంపై ఉన్న కేసులు ఎత్తివేయడానికి ప్రయత్నించడం న్యాయస్థానం సీరియస్‌గా పట్టించుకోవాలని ఆళ్ల డిమాండ్ చేయడం విశేషం.