శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: శనివారం, 10 జూన్ 2017 (14:13 IST)

ప్రభుత్వ ఉద్యోగస్తులను బట్టలిప్పి కొడతా : చెవిరెడ్డి... ఆయన బాటలో రోజా, పెద్దిరెడ్డి

పరిపాలనా వ్యవస్థలో అధికారులు నిమిత్తమాత్రులే. మొత్తం రాజకీయ వ్యవస్థే పరిపాలనను శాసిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ పార్టీల మధ్య నెలకొంటున్న ఆధిపత్య పోరు అధికారులకు అన్ని విధాలుగా ఇబ్బందిగా మారింది. తమ మాటే చెల్లుబాటు అవ్వాలంటున్న ఒకవైపు ప్రభుత్వ

పరిపాలనా వ్యవస్థలో అధికారులు నిమిత్తమాత్రులే. మొత్తం రాజకీయ వ్యవస్థే పరిపాలనను శాసిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ పార్టీల మధ్య నెలకొంటున్న ఆధిపత్య పోరు అధికారులకు అన్ని విధాలుగా ఇబ్బందిగా మారింది. తమ మాటే చెల్లుబాటు అవ్వాలంటున్న ఒకవైపు ప్రభుత్వ పెద్దలు అధికారులపై ఏకంగా దాడులకే దిగిన సంధర్భాలు అనేకం. తాము మాత్రం ప్రజాప్రతినిధులం కాదా అంటూ బెదిరింపులకు దిగుతున్న ప్రతిపక్షనేతలు మరోవైపు. ఇంతకీ ఈ రెండు పార్టీల మధ్య అధికారుల పరిస్థితి ఏంటి. తరచూ నాయకుల నోటి దురుసుకు కారణాలేంటి. 
 
మొన్న ఒక చింతమనేని ప్రభాకర్. నిన్న కేశినేని నాని. నేడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. వీరంతా ప్రజాప్రతినిధులే. అధికారుల చేత సక్రమంగా పనులు చేయించి ప్రజలకు సుపరిపాలన అందించాల్సిన బాధ్యత వీరిపైన ఉంటుంది. కానీ అధికారం అనే మాటకు రెండు చీలికలు ఏర్పడ్డాయి. ఒకవైపు ప్రభుత్వ పెద్దలు, మరోవైపు ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు. ప్రజాప్రతినిధి అన్నవాడు ఏ పార్టీలో ఉన్నా కొన్ని హక్కులను కలిగి ఉంటాడు. మరికొన్ని అధికారాలను కలిగి ఉంటాడు. అంతమేరకు నడుచుకుంటే ఎవరికి ఏ సమస్య ఉండదు. అధికారుల సొంత నిర్ణయాలకు అస్సలు తావే లేని వ్యవస్థలో మీరు అది చేయండి.. ఇది చేయండి అంటూ వారిపై ఒత్తిడి తేవడం ఎంతవరకు సమంజసం. అలాగని కొందరు అధికారులేమైనా నిజాయితీగా వ్యవహరిస్తున్నారంటే అదీ లేదు.
 
అధికార పార్టీ అలా ఆదేశించడం ఆలస్యం వెనుకాముందూ చూడకుండా అత్యుత్సాహంతో వాటిని అమలు చేస్తున్నారు. ఈ పరిస్థితులే కొన్నిసార్లు రాజకీయ వైరానికి దారితీస్తుండగా మరికొన్నిసార్లు అధికారులను టార్గెట్ చేసే వరకు వస్తున్నాయి. ఐదేళ్ళు అధికారంలో ఉండే ప్రజాప్రతినిధి 60 యేళ్ళు ఉద్యోగంలో ఉంటే ప్రభుత్వ ఉద్యోగి. ఎవరి గొప్పతనం వారికి ఉన్నవారు ఇద్దరు కలిసి నడిస్తే తప్ప అభివృద్ధి జరగదన్నది అందరికీ తెలిసిన విషయమే. కానీ అధికారులంటే కేవలం అధికార పార్టీ ప్రజాప్రతినిధుల మాట మాత్రమే వినాలి అన్న అభిప్రాయం ఏర్పడిపోవడం వల్లే ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. 
 
ఇలాంటి సంధర్భాలలో నాయకులు విచక్షణ కోల్పోయి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. తాజాగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అధికారులను అండమాన్‌కు పంపిస్తానంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తమ ప్రభుత్వం వస్తే ఒక్కొక్క అధికారికి గుర్తుపెట్టుకుని మరీ అండమాన్‌కు పంపిస్తామంటూ వ్యాఖ్యానించారు చెవిరెడ్డి. అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగస్తులను బట్టలిప్పి కొడతానన్నారు. 
 
వైసిపి కార్యకర్తలు, నాయకులను కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు హింసిస్తున్నారని ఆరోపించారు. అలాంటివారు ఒకవేళ ఉద్యోగ విరమణ పొందినా వారిని ఎట్టి పరిస్థితుల్లోను వదిలిపెట్టేది లేదన్నారు చెవిరెడ్డి. ఒక ప్రజాప్రతినిధిగా ఉండి అలాంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా బాధ్యతారాహిత్యమే... దురుసుతనమే. ఇలాంటి సంఘటనలే అధికార పార్టీపరంగా కూడా అనేకం జరిగాయి. కానీ ఎందుకిలా చేయాల్సి వస్తుందో కారణాలు అన్వేషించడంలో మాత్రం రెండు పార్టీలు విఫలమవుతున్నాయి. 
 
ఒకవైపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రభుత్వ అధికారులను టార్గెట్ చేసి మాట్లాడితే మరోవైపు వైసిపి ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి, రోజాలు ప్రజలకు రక్షణగా ఉన్న పోలీసు వ్యవస్థపైనే నోరుజారారు. ప్రభుత్వ అధికారులు, పోలీసులు ప్రభుత్వానికి బంట్రోతులుగా మారారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వీటిపై ఉద్యోగ సంఘాలు భగ్గుమంటున్నాయి.