శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 31 జులై 2015 (15:35 IST)

రిషితేశ్వరి ఆత్మహత్య.. ప్రిన్సిపల్‌ను A-1గా చేర్చండి: ఎమ్మెల్యే రోజా డిమాండ్

రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నాగార్జున విశ్వవిద్యాలయంలో విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనపై జరుగుతున్న విచారణ తూతూమంత్రంగా జరుగుతుందని రోజా ఫైర్ అయ్యారు.

ఈ కేసులో ప్రిన్సిపల్, వీసీని ఏ1, ఏ2 నిందితులుగా చేర్చాలని రోజా అన్నారు. ర్యాంగింగ్ వ్యవహారం యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోకుండా ప్రిన్సిపల్ నియంతలా వ్యవహరించారని, ర్యాంగింగ్ విషయంలో సుప్రీం మార్గదర్శకాలున్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రిన్సిపల్‌పై తగిన చర్యలు తీసుకోవాల్సిందేనని రోజా అన్నారు.
 
ర్యాంగింగ్ విషయంలో రిషితేశ్వరి తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా ప్రిన్సిపల్ పట్టించుకోలేదని, అందువల్లే విద్యార్థిని చనిపోయిందని విమర్శించారు. ప్రిన్సిపాల్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని, ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని రోజా డిమాండ్ చేశారు. ఈ కేసులో తొలి ముద్దాయిగా బాబూరావు పేరు చేర్చాలన్నారు.
 
హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో రోజా మాట్లాడుతూ, రిషితేశ్వరి ఘటనానంతరం యూనివర్సిటీకి సెలవులు ప్రకటించిన వీసీ, అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇక ఈ కేసు చార్జిషీటులో ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి పేరే చేర్చారని, అసలు కారకులైన నాగార్జున వర్సిటీ వీసీ, ప్రిన్సిపల్ పేర్లు ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. 
 
ప్రిన్సిపల్ అమ్మాయిలతో పార్టీలకు వెళుతుంటాడని, తందనాలు ఆడేవాడని, పిల్లలను, మహిళా లెక్చరర్లను వేధిస్తుంటూ ఉన్నాడని ఎన్నో కేసులు నమోదైనప్పటికీ బాబూరావు పట్ల ఏపీ సర్కారు వ్యవహరిస్తున్న తీరు పట్ల రోజా మండిపడ్డారు.

తహశీల్దార్ వనజాక్షి కేసులాగే దాన్ని నీరుగారుస్తున్నారని రోజా ఆరోపించారు. విద్యార్థులను బలిగొంటున్న ర్యాంగింగ్ భూతాన్ని తరిమికొట్టకుండా.. సుప్రీం కోర్టు మార్గదర్శకాలను పాటించకుండా ఇష్టానుసారం వ్యవహరించిన ప్రిన్సిపల్‌పై తగిన చర్యలు తీసుకోవాల్సిందేనని రోజా డిమాండ్ చేశారు.