తేడా వస్తే... అసెంబ్లీనే రద్దు చేస్తా... కేసీఆర్
పార్టీ నిర్దేశించిన ప్రకారం ఓట్లు వేస్తే పోటీ చేస్తున్న ఐదు సీట్లను టీఆర్ఎస్ గెలుచుకుంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ధీమా వ్యక్తం చేశారు. తేడా వస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని అవసరమనుకుంటే శాసనసభనే రద్దు చేస్తామని హెచ్చరించారు. అందుకే జాగ్రత్తగా వ్యవహరించుకోవాలని సలహా ఇచ్చారు. గెలుస్తామనే పూర్తి విశ్వాసంతోనే ఐదో సీటుకు అభ్యర్థిని నిలబెట్టామని, పార్టీ ఆదేశాలకు అనుగుణంగా ఎమ్మెల్యేలు వ్యవహరిస్తే సునాయాసంగా విజయం సాధిస్తామన్నారు.
ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ సీట్లకు జూన్ 1న జరగనున్న ఎన్నికలు, అదే రోజుతో ముగుస్తున్న ఏడాది పాలనపై కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం శుక్రవారం తెలంగాణ భవన్లో జరిగింది. దాదాపు ఎమ్మెల్యేలంతా దీనికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారికి కేసీఆర్ హెచ్చరికలతో కూడిన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా చివరికి మన గూటికే చేరుతారని అన్నారు. వచ్చే రోజుల్లో రాష్ట్రంలో టీఆర్ఎస్తో పాటు ఎంఐఎం పార్టీ మాత్రమే మిగులుతాయని జోస్యం చెప్పారు. ఈ విషయాలన్నీ గుర్తుంచుకుని పార్టీ నిర్దేశం ప్రకారం ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి, రెండో ప్రాధాన్యత ఓట్లు వేయాలి. దీనిపై శని, ఆదివారాల్లో తెలంగాణ భవన్లో మాక్ ఓటింగ్ ద్వారా అవగాహన కల్పిస్తామని సీఎం స్పష్టం చేసినట్లు తెలిసింది. ఎమ్మెల్యేల ఓట్లకు సంబంధించి జిల్లా మంత్రులదే మొదటి బాధ్యత అని, ముందుగా వారి పదవులు పోతాయని కూడా కేసీఆర్ హెచ్చరించినట్లు సమాచారం.