బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Srinivas
Last Updated : గురువారం, 7 జూన్ 2018 (16:47 IST)

పిల్లలను కార్పొరేట్ స్కూల్లో చదివించడం లేదని... కదులుతున్న రైల్లోంచి దూకేసిన తల్లి..

తమ పిల్లలకు కార్పొరేట్‌ విద్యనందించి వారి భవిష్యత్తుకు మంచి బాటలు వేయాలనుకుంది ఆ తల్లి. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతతమాత్రంగా ఉండటంతో పిల్లల చదువు కష్టంగా మారింది. భర్త ఎలాగైనా చదివిస్తాడనుకుంటే తన వల్

తమ పిల్లలకు కార్పొరేట్‌ విద్యనందించి వారి భవిష్యత్తుకు మంచి బాటలు వేయాలనుకుంది ఆ తల్లి. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతతమాత్రంగా ఉండటంతో పిల్లల చదువు కష్టంగా మారింది. భర్త ఎలాగైనా చదివిస్తాడనుకుంటే తన వల్ల కాదని చేతులెత్తేశాడు. ఈ పరిణామానికి కుంగిపోయిన ఆమె.. కన్నబిడ్డలతో కదులుతున్న రైల్లోంచి దూకేసింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. ఆరేళ్ల పాప గాయాలతో బయటపడింది.
 
శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం వెంకంపేట గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌, ఇందుమతి దంపతులు తమ సంతానం జ్యోత్స్న(6), బద్రీనాథ్‌(5)తో కలిసి ఏడాది కిందటే విశాఖపట్నం వడ్లపూడి దరి కణితి ఆర్‌హెచ్‌ కాలనీకి వలస వచ్చారు. చంద్రశేఖర్‌ ట్రాక్టర్‌ డ్రైవర్‌గా, ఇందుమతి స్థానికంగా టైలరింగ్‌ దుకాణంలో పని చేస్తున్నారు. మొదటి నుంచీ తన పిల్లల్ని బాగా చదివించాలనే తపనతో ఉన్న ఇందుమతి ప్రైవేటు పాఠశాలలో చేర్పించాలని భర్తతో చెబుతుండేది. దానికి తమ ఆర్థిక స్తోమతు సరిపోదని అతను వారించేవాడు. 
 
ఇది ఇద్దరి మధ్య గొడవలకు దారి తీసింది. దీనిపై తరచూ వివాదాలు జరుగుతుండేవి. ఇటీవలే ఇందుమతి స్థానిక ప్రైవేట్‌ పాఠశాలలో పిల్లలకు సంబంధించిన ధ్రువపత్రాలు అందజేయడంతో... మంగళవారం భార్యభర్తలిద్దరూ మళ్లీ గొడవ పడ్డారు. చివరకు ఆమె బలవన్మరణానికి తెగించింది. పిల్లలకు తాను కోరుకున్న విద్యాబోధన అందించలేకపోతున్నానని మనస్తాపంతో బుధవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఇద్దరు పిల్లలతో కలిసి విశాఖపట్నం వెళ్లే రైలును దువ్వాడ స్టేషన్‌లో ఎక్కింది. రైలు గోపాలపట్నం సమీపంలోని భగత్‌సింగ్‌నగర్‌ సమీపంలోకి రాగానే... ఇద్దరు పిల్లలను రెండు చేతులతో పట్టుకుని కిందకు దూకేసింది. ఈ ఘటనలో తల్లి, కుమారుడు మృతి చెందగా, కుమార్తె జ్యోత్స్న గాయాలతో బయటపడింది.