శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : బుధవారం, 25 ఫిబ్రవరి 2015 (07:25 IST)

చిత్తూరు : మహిళ హత్యకేసులో కుమార్తె, అల్లుడి అరెస్టు!

చిత్తూరు నగరంలో యేడాదిన్నర క్రితం అనుమానాస్పదంగా జరిగిన విజయలక్ష్మి అనే మహిళ హత్య కేసు మిస్టరీ ఇప్పటికి వీడింది. ఈ హత్య కేసులో ఆమె పెద్ద కుమార్తె బాంధవి (26), అల్లుడు రవిప్రసాద్‌ను చిత్తూరు రెండో పట్టణ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. 
 
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే.. చిత్తూరులోని దుర్గానగర్ కాలనీకి చెందిన విజయలక్ష్మి, రామమూర్తి దంపతులకు నగరంలోనే పలు చోట్ల ఆస్తులు ఉన్నాయి. వీరికి ముగ్గురు కుమార్తెలు. ఆస్తిలో వాటా ఇవ్వాలని పెద్ద కుమార్తె బాంధవి పలుమార్లు తల్లిదండ్రులతో ఘర్షణ పడింది. అయితే, మిగిలిన ఇద్దరు కుమార్తెలకు వివాహం చేసిన తర్వాత ఆస్తి పంపకాలు చేపడతామంటూ తల్లి ఎంత చెప్పినా వినలేదు. 
 
ఈ నేపథ్యంలో తల్లి, అడ్డుగా ఉన్న ఇద్దరు చెల్లెళ్ల అడ్డు తొలగిస్తే ఆస్తంతా తనకే దక్కుతుందన్న దురాశ బాంధవికి పట్టుకుంది. దీంతో తన భర్తతో కలిసి ప్లాన్ వేసింది. ఆ ప్రకారంగా 2013 ఆగస్టు 23వ తేదీన రాత్రి 8.30 గంటల సమయంలో ఆమె, భర్త రవిప్రసాద్‌తో కలిసి మత్తుమందును చేతి రుమాలులో ఉంచుకుని విజయలక్ష్మి ముహంపై పెట్టింది. కానీ అది పనిచేయలేదు. కేకలు వేయడానికి ప్రయత్నించిన ఆమె నోరును గట్టిగా నొక్కి పట్టుకుంది. రవిప్రసాద్ కత్తి తీసుకుని విజయలక్ష్మి మెడపై పొడిచి చంపేశాడు. మృతదేహాన్ని మంచం కింద దాచేశాడు. 
 
మరికొద్దిసేపటి తర్వాత బాంధవి చెల్లెల్లు ఇంటికి వెళ్లారు. ఒకరిని ఇంటి బయటపెట్టి మాటల్లోకి దింపింది. ఈ సమయంలో ఇంట్లో ఉన్న ఆమె మరో చెల్లెలు నందినిని సైతం రవిప్రసాద్ కత్తితో పొడిచి గాయపరిచాడు. నందిని, ఇంటి బయటున్న మరో చెల్లెలు పెద్దగా కేకలు వేయడంతో నిందితులు పారిపోయారు. నందిని చికిత్సలు పొందిన తర్వాత కోలుకుంది. అప్పటి నుంచి బాంధవి, ఆమె భర్త పరారీలో ఉన్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలించగా, వారు హైదరాబాద్‌లో ఉన్నట్టు గుర్తించి అరెస్టు చేశారు.