గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 2 మార్చి 2018 (14:12 IST)

నీతి కలిగిన టీడీపీ భ్రష్టుపట్టిపోయింది... నాయకత్వ లోపం : మోత్కుపల్లి

నీతి కలిగిన తెలుగుదేశం పార్టీ భ్రష్టుపట్టిపోయిందంటూ ఆ పార్టీకి చెందిన తెలంగాణ ప్రాంత సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. ఓటుకు నోటు కేసుతో పార్టీ పరువును రేవంత్ రెడ్డి బజారుకీడ్చారని మండిపడ

నీతి కలిగిన తెలుగుదేశం పార్టీ భ్రష్టుపట్టిపోయిందంటూ ఆ పార్టీకి చెందిన తెలంగాణ ప్రాంత సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. ఓటుకు నోటు కేసుతో పార్టీ పరువును రేవంత్ రెడ్డి బజారుకీడ్చారని మండిపడ్డారు. ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డిని ఆనాడే పార్టీ నుంచి సస్పెండ్ చేసివుంటే పార్టీకి ఈ పరిస్థితి దాపురించేదికాదని మోత్కుపల్లి చెప్పుకొచ్చారు. అదేసమయంలో తెరాసతో రేవంత్ రెడ్డికి వైరం ఉండొచ్చునేమో.. తనకు మాత్రం లేదన్నారు. 
 
టీడీపీ జాతీయ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన టీ టీడీపీ నేతల సమావేశం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సమావేశానికి మోత్కుపల్లిని దూరంగా ఉంచారు. ఈ చర్యపై మోత్కుపల్లి శుక్రవారం ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణాలో టీడీపీకి దిక్కే లేకుండా పోయిందన్నారు. ఒంటేరు వేణుగోపాల్ రెడ్డిని అరెస్టు చేసి జైల్లో పెడితే అడిగే నాథుడే లేరన్నారు. 
 
ఇకపోతే, ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన వద్ద పని చేశాననీ, అదే నిబద్ధతతో చంద్రబాబు వద్ద కూడా పని చేశానని గుర్తుచేశారు. తెలంగాణ వాదం వచ్చినప్పుడు కూడా చంద్రబాబు తరపున నేను తప్ప ఎవ్వరూ మాట్లాడలేదు. అప్పట్లో చంద్రబాబుపై చాలామంది అనేక రకాల విమర్శలు గుప్పించారని తెలిపారు. అటువంటి సమయంలో ఏ టీడీపీ నాయకుడు కూడ ఒక్క మీడియా సమావేశం కూడా పెట్టలేక పోయాడన్నారు. కానీ, తాను ధైర్యంగా ముందుకు వచ్చి తెలంగాణలో టీడీపీ తరపున మాట్లాడితే చంద్రబాబుకి అనుకూలంగా మాట్లాడినట్టు చెప్పారు.
 
ఇకపోతే, తెలంగాణలో పటిష్టమైన నాయకత్వం లేదు. నీతి కలిగిన టీడీపీ భ్రష్టుపట్టిపోయింది. నాయకత్వం సరిగ్గా లేదు. ఎవరెవరికి పదవులు ఇచ్చారో వారే చంద్రబాబుకి ద్రోహం చేశారని ఆయన వ్యాఖ్యానించారు. అదేసమయంలో పేద ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు గొంతెత్తి మాట్లాడాను. చంద్రబాబు నాకు ఏమిచ్చినా ఏమి ఇవ్వకపోయినా నేను చంద్రబాబు తమ్ముడిలాంటి వాడినేనని మోత్కుపల్లి చెప్పుకొచ్చారు.