మల్లి మస్తాన్ బాబు మనందరి మధ్య బతికే ఉన్నాడు... సోదరి దొరసానమ్మ
ప్రముఖ పర్వతారోహకుడు మల్లి మస్తాన్ బాబు మృత దేహం శుక్రవారం ఢిల్లీకి చేరుకుంది. ఆయన భౌతికకాయాన్ని ఢిల్లీ నుంచి చెన్నైకు, ఆ తర్వాత రోడ్డు మార్గం ద్వారా నెల్లూరు లోని స్వస్థలానికి తీసుకెళతారు. తన సోదరుడు చివరి యాత్ర కూడా విజయవంతంగా పూర్తిచేసి గర్వంగా తిరిగి వస్తాడని తాము అనుకున్నామనీ, కానీ ఇలా నిర్జీవంగా తమ వద్దకు వస్తాడని అనుకోలేదంటూ ఆయన సోదరి దొరసానమ్మ గద్గద స్వరంతో చెప్పారు. తన సోదరుడు ఎన్నో విజయాలు సాధించారని, ఆయన సాధించిన విజయాల పట్ల మనమంతా గర్వపడాలని ఆయన సోదరి దొరసానమ్మ అన్నారు.
మస్తాన్బాబు మృతదేహాన్ని ఢిల్లీ తీసుకువచ్చిన తర్వాత ఆమె విలేఖరులతో మాట్లాడారు. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చినందుకు దొరసానమ్మ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, సుష్మాస్వరాజ్లు తీవ్రంగా కృషి చేశారని ఆమె పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో తాము మస్తాన్బాబు మృతదేహాన్ని తీసుకువచ్చామని ఏపీ భవన్ అసిస్టెంట్ రెసిడెంట్ కమిషనర్ శ్రీకాంత్ చెప్పారు.