కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ దీక్ష ప్రారంభం.. కిర్లంపూడిలో భారీ భద్రత
కాపు రిజర్వేషన్ ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం భార్యతో కలిసి శుక్రవారం ఉదయం 9 గంటలకు ఆయన ఇంట్లో ఆమరణ దీక్ష చేపట్టారు. ఈ విషయం తెలుసుకుని ఆయనను చూసేందుకు వచ్చిన సందర్శకులకు పోలీసులు అనుమతి నిరాకరించారు. కిర్లంపూడి సహా, తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. జాతీయ రహదారిపై పలు సమస్యాత్మక ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేశారు.
తుని, తొండంగి, కోనందూరు, తేటగుంట, కత్తిపూడి తదితర ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. వాహనాలను నిశితంగా పరిశీలించి పంపుతున్నారు. ఆరుగురు డీఎస్పీలు, 24మంది సీఐలు, 50మంది ఎస్సైలు 200మంది ఏఎస్సైలు, 700 మంది కానిస్టేబుళ్లు, వెయ్యిమందికి పైగా పారామిలటరీ బలగాలతో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా తన ఇంటికి ఎవరూ రావద్దని, వచ్చి ఇబ్బందుల పాలయ్యే కంటే ఎక్కడికక్కడ గాంధీ మార్గంలో నిరసనలు తెలపాలని ఆయన తన అనుచరులు, కాపులకు తెలియజేశారు.
మరోవైపు.. రత్నాచల్ ఎక్స్ప్రెస్ ఈనెల 8 నుంచి పట్టాలపైకి రానుంది. 17 బోగీలతో రత్నాచల్ ఎక్స్ప్రెస్ను పునరుద్దరించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. 2 ఏసీ ఛైర్కార్ బోగీలు, 8 సెకండ్ సిట్టింగ్, 4 సాధారణ ద్వితీయ శ్రేణి బోగీలు, ఒక వంటశాల బోగీ, రెండు సరకు, బ్రేక్ వ్యాన్ ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.