శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 23 మే 2015 (10:37 IST)

నరేంద్ర మోడీ మాట తప్పరు.. ప్రత్యేక హోదాకు కట్టుబడివున్నా : మురళీధర రావు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే అంశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట తప్పరని, ఆయన మాటకు కట్టుబడి ఖచ్చితంగా ప్రత్యేక హోదా కల్పిస్తారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర రావు అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వ యేడాది పాలనపై ఆయన స్పందిస్తూ.. తొలి ఏడాది పాలనలో సామాజిక భద్రత, అవినీతి రహిత పాలనకు ప్రాధాన్యమిచ్చామన్నారు. 
 
ద్రవ్యోల్బణాన్ని తగ్గించామని, పెట్టుబడులను అమితంగా ఆకర్షించారని చెప్పారు. భవిష్యత్తులో విప్లవాత్మక నిర్ణయాలు ఉంటాయని, ఎవరూ ఊహించని విధంగా ముందుకు దూసుకెళ్తామన్నారు. ఉపాధి అవకాశాలు పెంచుతామని, నైపుణ్యాల అభివృద్ధికి ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు.
 
ఇకపోతే.. ఆంధ్రప్రదేశ్ విషయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కేంద్రం మాట తప్పదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సహా అన్ని హామీలను నెరవేరుస్తామన్నారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని విస్మరించబోమని, తమది మాట తప్పే నాయకత్వం కాదని అన్నారు. తెలుగుదేశం పార్టీతో కలిసి బీజేపీ పనిచేస్తుందని, బీజేపీ అన్ని పార్టీలను కలుపుకుని పోవాలని యత్నిస్తుందని వివరించారు.