శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 29 జనవరి 2015 (14:51 IST)

భార్యను హత్య చేసిన కసాయి సీఐపై మర్డర్ కేసు నమోదు!

పోలీసు తెలివితేటలు ఉపయోగించి భార్యను పాశవికంగా హత్య చేసి... పొలం వద్ద గుర్తు తెలియని వాహనం దూసుకెళ్ళడంతో భార్య మృతి చెందిందని నమ్మించే యత్నం చేశారంటూ సీఐ అర్జున్ నాయక్‌పై అనంతపురం జిల్లా పోలీసులు మర్డర్ కేసు (హత్యానేరం)ను నమోదు చేశారు. జిల్లా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో నల్లమాడ పోలీస స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది. 
 
కడప జిల్లా పీటీసీలో సీఐగా విధులు నిర్వర్తిస్తున్న అర్జున్ నాయక్ మంగళవారం భార్య పద్మతో కలిసి అనంతపురం జిల్లాకు చెందిన తన స్వగ్రామంలోని పొలం వద్దకెళ్లాడు. రాత్రి పొద్దుపోయేదాకా అక్కడే ఉన్న వారు, రాత్రి కంది పంట వద్ద రోడ్డు పక్కగా నిద్రించారు. ఈ క్రమంలో నిన్న ఉదయానికంతా పద్మ విగత జీవిగా మారగా, అర్జున్ నాయక్ కూడా స్వల్పంగా గాయపడ్డాడు. 
 
గుర్తు తెలియని వాహనం తమపై నుంచి వెళ్లిందని, దీంతో పద్మ చనిపోయిందని అర్జున్ నాయక్ నమ్మించేందుకు ప్రయత్నించాడు. అయితే పద్మ మృతదేహంపై ప్రమాదానికి సంబంధిన ఆనవాళ్లు లేకపోవడంతో అర్జున్ నాయక్ వ్యవహార సరళిపై ఆయన పిల్లలు, పద్మ తరపు బంధువులు అనుమానం వ్యక్తం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హత్యానేరం నమోదు చేశారు.