గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ttdj

ఒక్క ఆరోపణ నిరూపిస్తే నేరుగా జైలుకు వెళ్తా : తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్

తిరుపతి వేదికగా జరుగుతున్న మహానాడులో టిడిపి యువనేత నారాలోకేష్ ఆవేశ పూరితంగా ప్రసంగించారు. ఏపి ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు లోకేష్. దమ్మూ, ధైర్యం అనేది ఉంటే.. నాపైన ఆరోపణలను ఒక్కటి నిరూపించినా జైలుకు వెళ్లి కూర్చుంటానంటూ సవాల్ విసిరారు. 40కు పైగా కేసులు ఉన్న జగన్ కూడా తనగురించి, తన తండ్రి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
 
అభివృద్ది అంటేనే తెలుగుదేశం పార్టీ అని, ఏడునెలల్లో అమరావతి అభివృద్దే దానికి నిదర్శనమన్నారు. రానున్న రెండేళ్లలో 25 వేల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అమరావతి ఆలస్యం కావడానికి కూడా ప్రతిపక్ష జగనే కారణమని ఆరోపించారు. 138 ఏళ్ల చరిత్రకల్గిన కాంగ్రెస్ పార్టీయే తెలుగుదేశం ముందు తోకముడిచిందని, అలాంటిది వైఎస్సార్ కాంగ్రెస్ ఎంత అని అన్నారు.
 
తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రాంత పార్టీ అని, తెలంగాణ పార్టీ కాదని టిఆర్‌ఎస్ నేతలు చెప్పడం‌పై తీవ్రంగా స్పందించారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన సమయంలో ప్రస్తుతం ఉన్న తెరాస నేతలంతా ఆనాడు టిడిపిలోనే క్యూ కట్టిన వారేనని గుర్తుచేశారు. తెలంగాణలో టిడిపి జెండాను రెపరెపలాడిస్తామని ధీమా వ్యక్తంచేశారు. రైతు రుణమాపీ నుంచి డ్వాక్రా రుణాలు మాఫీ వరకు పూర్తి స్థాయిలో అమలు చేసామన్నారు. 
 
అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో ఏపిలోని 13 జిల్లాల్లో ఉన్న మారుమూల గ్రామాల్లో సైతం 24 గంటలు విద్యుత్ సరఫరా అందించిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని అన్నారు. జగన్ ప్రత్యక్షంగా అయినా, పరోక్షంగా అయినా, తెరాస పార్టీతో చేతులు కలుపుతున్నంత మాత్రానా టీడీపీకి వచ్చే నష్టం ఏమి లేదన్నారు. నారా లోకేష్ ప్రసంగంతో పార్టీ క్యాడర్‌లో నూతన ఉత్తేజాన్ని నింపింది.