గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 6 మార్చి 2017 (08:48 IST)

అర్థరాత్రి నిర్ణయం... చంద్రబాబొచ్చాడు... లోకేష్‌కు జాబొచ్చింది : టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే

'బాబొస్తే... జాబొస్తుంది...' ఇది గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రచారం. నిజంగానే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన కుమారుడు నారా లోకేష్‌కు జాబొచ్చింది. అది కూడా అర్థరాత్రి. ఇంతకీ నారా లోకేష్‌కు వచ్

'బాబొస్తే... జాబొస్తుంది...' ఇది గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రచారం. నిజంగానే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన కుమారుడు నారా లోకేష్‌కు జాబొచ్చింది. అది కూడా అర్థరాత్రి. ఇంతకీ నారా లోకేష్‌కు వచ్చిన ఉద్యోగం ఏంటో తెలుసా? ఏపీ శాసనమండలిలో ఎమ్మెల్సీగా ఎన్నిక కానుండటం. ఎమ్మెల్యే కోటాలో ఆయనకు ఎమ్మెల్సీ టిక్కెట్ కేటాయించారు. గత ఎన్నికల్లో దుమ్మురేపిన టీడీపీ నినాదం ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిందో లేదో తెలియదుగానీ... చంద్రబాబు మాత్రం తన కుమారుడిని ఎమ్మెల్సీగా ఎన్నుకున్నారు. 
 
కాగా, ఏపీ శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ఆదివారం అర్థరాత్రి 12 గంటల సమయంలో ఖరారు చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ (చిత్తూరు), టీడీపీ సీనియర్ నేతలు కరణం బలరాం, పోతుల సునీత (ప్రకాశం), డొక్కా మాణిక్యవరప్రసాద్‌ (గుంటూరు), బచ్చుల అర్జునుడు (కృష్ణా)లకు అవకాశం కల్పించారు.
 
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ గడువు మంగళవారంతో ముగియనున్న నేపథ్యంలో లోకేశ్‌ సోమవారం ఉదయం వెలగపూడిలోని అసెంబ్లీలో ఉదయం 10.39 గంటలకు నామినేషన్ పత్రాలు సమర్పిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన నాగుల్‌ మీరా(గుంటూరు)కు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వలేనందున పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు.
 
నారా లోకేష్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించిన నేపథ్యంలో ఆయనను అభ్యర్థిగా ఎంపిక చేశారు. పార్టీ పట్ల విధేయత, దీర్ఘకాలంగా పార్టీని అంటిపెట్టుకుని ఉండటంతో పాటు అద్దంకి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌తో ఉన్న రాజకీయ ఇబ్బందుల్ని పరిష్కరించే లక్ష్యంతో కరణం బలరాంకు అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది.