శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 19 నవంబరు 2019 (14:12 IST)

తెలంగాణాలో నయా ట్రెండ్... 'రెవెన్యూ'పై ఉసిగొల్పుతున్న నేతలు

ఇప్పుడు మన బంగారు తెలంగాణాలో ఇదొక కొత్త ట్రెండ్. ఉద్యోగులు, అధికారులు, కింది స్థాయి ప్రజాప్రతినిధులు లంచగొండులు. దోపిడీదారులు. ప్రజాకంటకులు. వాళ్ళను నిలదీయాలి. తిట్టాలి. కోపంతో కొట్టొచ్చు. ఈ ట్రెండ్ రెవిన్యూ ఉద్యోగుల మీద ప్రజలని తెలివిగా ఉసిగొల్పడంతో మొదలైంది. 
 
ఇప్పుడు సామాన్య గ్రామీణ రైతాంగంలో కింది ఉద్యోగుల పట్ల తీవ్రమైన ద్వేష భావాన్ని రగల్చడంలో పాలకుల ఎత్తు పారింది. కేసీఆర్ మంచి చేస్తుంటే వీళ్ళు మనల్ని పీడిస్తున్నారు అనే భావం గ్రామాల్లోకి పోయింది. అయితే, వాటాలు తీసుకుని, ఈ లంచగొండులకి వెన్నుదన్నుగా ఉండే ఎమ్మెల్యేలు, మంత్రుల పాత్ర మరుగున పడిపోయేలా గొప్ప వ్యూహం రచించారు. 
 
అలాగే వారికి అత్యంత సన్నిహితులై ఉంటూ, వేలాది ఎకరాల రెవిన్యూ రికార్డులను ఉద్యోగుల సహకారంతో తారుమారు లేదా మాయం చేస్తూ బడా బిల్డర్‌లుగా, రియల్ ఎస్టేట్ మాగ్నెట్‌లుగా దర్జాగా చెలామణీ అవుతున్న నయవంచక బడా కబ్జాసార్వభౌముల కథలు జనం దృష్టికి రాకుండా పైస్థాయిలో సకల జాగ్రత్తలూ తీసుకోవడం జరుగుతోంది. 
 
అన్ని నేరాలూ తెలివిగా ఉద్యోగుల చేత చేయించడం, పైకి నీతివాక్యాలు, ఆధ్యాత్మిక అభినయ ప్రదర్శనలూ చెయ్యడం సామాన్య ప్రజలకు తెలియవు. ఈ పైఉద్యోగుల మీద, ప్రజాప్రతినిధుల మీద ఏసీబీ దాడులు జరగవు. ఒకవేళ జరిగినా దాని వెనక కొన్ని సామాజిక, ఆర్థిక, కులపరమైన కారణాలుంటాయి. నిజంగా ఏసీబీ దాడులు జరగాలంటే ఏ ప్రభుత్వ కార్యాలయం, ఏ పోలీస్ స్టేషన్, ఏ రిజిస్ట్రార్ ఆఫీస్, ఏదీ ఏదీ మినహాయింపు కాదు. ఇప్పటి ఏసీబీలో మరో ఏభై వేల మంది నిజాయితీపరుల్ని అదనంగా చేర్చుకున్నా తక్కువే. అంత పని ఉంటుంది.