గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 17 ఫిబ్రవరి 2019 (09:27 IST)

లేడీ వాయిస్‌తో జయరామ్‌కు వలవేసిన నటుడు... హత్య చేసిన రాకేశ్

కోస్టల్ బ్యాంకు ఛైర్మన్ చిగురుపాటి జయరామ్ హత్య కేసులో సరికొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. తన ఇంటికి జయరామ్‌ను రప్పించేందుకు సినీ నటుడు సూర్య పింక్ పాంక్‌ను సంప్రదించి అతని ద్వారా లేడీ వాయిస్‌తో వలలో వేసి ఇంటికి రప్పించినట్టు రాకేశ్ రెడ్డి వెల్లడించాడు. అయితే, జయరామ్ మేనకోడలు శిఖా చౌదరి ఇపుడు నిందితురాలా? బాధితురాలా? అనే విషయాన్ని పోలీసులు ఇంకా నిర్ధారించలేక పోతున్నారు. 
 
రాకేశ్ రెడ్డి కథనం మేరకు తను హైప్రొఫైల్‌ అమ్మాయి శిఖా చౌదరిని ప్రేమించాడు. కలిసి తిరిగాడు. లాంగ్‌ డ్రైవ్‌లకు వెళ్లాడు. దందాల్లో సంపాదించిన సొమ్మును ఆమె స్థాయిలో ఖర్చు పెట్టాడు. కానీ, శిఖా పెళ్లికి అంగీకరించలేదు. ఆమెను తనదైన శైలిలో బెదిరించాడు. ఆమె లెక్క చేయలేదు. ఇక చేసేది లేక శిఖాపై పెట్టిన ఖర్చును రాబట్టుకోవాలనుకున్నాడు. 
 
ఇందులోభాగంగా ఆమెపై ఒత్తిడి పెంచాడు. దీంతో ఆమె తన మేనమామ జయరాంను ఆశ్రయించింది. 'సరే ఆమెపై ఖర్చు పెట్టిన మొత్తం ఇస్తాలే' అని జయరాం అంగీకరించాడు. ఆ సొమ్ము వసూలు కోసం వెంటబడే క్రమంలో జయరాంకు భారీ ఎత్తున ఆస్తులున్నట్లు తెలియవచ్చింది. బెదిరించి ఆస్తులు కొట్టేయాలని నిర్ణయించుకున్నాడు. 
 
ఇందుకోసం సినీనటుడు సూర్య ప్రసాద్‌ ద్వారా వీణ అనే పేరుతో హనీట్రాప్‌ వేశాడు. ఇంటికి రప్పించాడు. రౌడీ మిత్రులతో కలిసి హింసించి వంద రూపాయల బాండ్‌ పేపర్‌ మీద సంతకాలు పెట్టించుకున్నాడు. అయితే, జయరాం నుంచి ఆరు లక్షలకు మించి క్యాష్‌ రాబట్టలేక పోయాడు. ఆ ఉక్రోషంలో మిత్రులతో కలిసి జయరాంను హత్య చేసినట్టు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో రాకేష్ రెడ్డి వెల్లడించాడు.