గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By IVR
Last Updated : మంగళవారం, 22 జులై 2014 (16:02 IST)

బ్లైండ్ స్కూల్ దారుణం... సుమోటోగా స్వీకరించిన ఎన్‌హెచ్‌ఆర్‌సి

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని అంధుల పాఠశాల ఘటన నేపధ్యంలో ఈ మొత్తం వ్యవహారాన్ని జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సి) సీరియస్ గా తీసుకుని కేసును సుమోటోగా స్వీకరించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌కు నోటీసులు జారీ చేస్తూ నాలుగు వారాల్లోగా దీనిపై సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. 
 
అంధులని కూడా చూడకుండా ముగ్గురు పిల్లలను అంధుల పాఠశాల కరస్పాండెంట్ బెత్తం పట్టుకుని గొడ్డును బాదినట్టు చితకబాదాడు. అది కూడా ఏదో తప్పు చేసిన వాళ్లను దండించినట్లు కాకుండా.. ఆ పిల్లలతో తనకు జన్మజన్మల విరోధం ఉన్నట్లుగా కొట్టాడు. ఆ దెబ్బలను తట్టుకోలేక కాళ్లావేళ్లా పడిన ఆ కరస్పాండెంట్ ఏమాత్రం కనికరించలేదు. ఇంత చేసిన సదరు కరస్పాండెంట్ కూడా అంధుడే కావడం గమనార్హం. ఈ దారుణ సంఘటన కాకినాడలోని గ్రీన్ఫీల్డ్స్ అంధుల పాఠశాలలో జరిగింది. 
 
స్వయంగా తాను కూడా అంధుడే అయిన పాఠశాల కరస్పాండెంట్, పిల్లలు అల్లరి చేశాడని ముగ్గురిని పట్టుకుని పేకబెత్తంతో వీపుమీద ఎడాపెడా బాదేశాడు. వద్దు వద్దని కాళ్లు పట్టుకుని వేడుకుంటున్నా ఏమాత్రం కనికరించలేదు. కళ్లు కనిపించక ఓ పిల్లాడు వేరేవైపు తిరిగి ఉంటే, 'ఒరేయ్ అటు కాదురా.. నేను ఇక్కడున్నాను ఇటు తిరుగు' అంటూ తనవైపు తిప్పుకొని మళ్లీ మళ్లీ బెత్తంతో వీపుమీద ఎడాపెడా బాదేశాడు. ఆయనకు మరో వ్యక్తి కూడా దగ్గరుండి సహకరించాడు. 
 
ఇదే అంశంపై డీఈవో శ్రీనివాసుల రెడ్డి స్పందించి.. పాఠశాలకు మండల విద్యాశాఖాధికారిని పంపి విచారణ జరిపారు. ఆ తర్వాత వారిద్దరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ సంఘటనపై బాలల హక్కుల కమిషన్కు చెందిన అచ్యుతరావు కూడా స్పందించారు. అసలు పిల్లల ఒంటిమీద చెయ్యి కూడా వెయ్యకూడదని, అలాంటిది అంధుడని కూడా చూడకుండా చిన్నారి ఒంటిమీద వాతలు తేలేలా అంతలా కొట్టడం అత్యంత హేయమైన ఘటన అని మండిపడ్డారు.