శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 1 ఆగస్టు 2017 (14:45 IST)

ఇప్పటికింతే సర్దుకుపోండి.. అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచలేం.. హాన్స్‌రాజ్

రాష్ట్రవిభజన అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రాన్ని మొరపెట్టుకుంటూ వచ్చారు. ఇదే అంశంపై ఇరువురు సీఎంలు కేంద్ర హోంశాఖతో పలుదఫాలుగా చర్చల

రాష్ట్రవిభజన అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రాన్ని మొరపెట్టుకుంటూ వచ్చారు. ఇదే అంశంపై ఇరువురు సీఎంలు కేంద్ర హోంశాఖతో పలుదఫాలుగా చర్చలు కూడా జరిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయితే, ఇప్పట్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపు లేదన్నట్టుగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హాన్స్‌రామ్ గంగారామ్ అహిర్ తేల్చి చెప్పారు. 
 
మంగళవారం లోక్‌సభలో టీడీపీ ఎంపీ మురళీమోహన్, తెరాస ఎంపీ జితేందర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు ఇప్పట్లో లేదన్నారు. 2019లోగా అసెంబ్లీ సీట్లను పెంచాలంటే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 170(3)ని సవరించడం ఒక్కటే మార్గమని, అది ఇపుడు సాధ్యపడదన్నారు. 
 
అందువల్ల 2026 వరకు వేచివుంటే అప్పటి జనాభా లెక్కల ఆధారంగానే అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పునర్వ్యవస్థీకరణ ఉంటుందే తప్ప, ఈలోగా నియోజకవర్గాల పెంపు ఉండదని వెల్లడించారు. దీంతో ఈ విషయంలో మరింత స్పష్టత వచ్చినట్లయింది. కేంద్ర మంత్రి ప్రకటన ఇరు రాష్ట్రాల్లో అధికార, విపక్ష పార్టీల నేతలకు తీవ్ర నిరాశకు లోనుచేసింది.