బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 22 ఆగస్టు 2014 (19:16 IST)

అసెంబ్లీ జగన్ కామెంట్స్: వాళ్లని ఆపమనండి నేను ఆపుతా!

అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. తన కుటుంబంపై టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటానని ఆయన అన్నారు. ఈ విషయంలో ఎలాంటి భేషజాలకు పోబోమన్నారు. 
 
వైసీపీ కార్యకర్తల హత్యలపై హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని జగన్ డిమాండ్ చేశారు. తనను హంతకుడన్నారని, నరరూపరాక్షసుడన్నారని.. ఈ వ్యాఖ్యలను వారు ఉపసంహరించుకుంటే తాను కూడా బఫూన్లన్న కామెంట్స్‌ను విత్ డ్రా చేసుకుంటానని చెప్పుకొచ్చారు. హత్యల సంఖ్యలో తాను తప్పుదారి పట్టంచలేదని, సంఖ్యలది ఏముందని, మానవీయ కోణంలో చూడాలని జగన్ అన్నారు. 
 
మరోవైపు శాసనసభలో జగన్ చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదని వైసీపీ సభ్యులు శ్రీకాంత్‌రెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్‌రెడ్డి చెప్పారు. సభాపతి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని వారు మండిపడ్డారు. టీడీపీ సభ్యులు ప్రతిపక్ష నాయకుడిని తీవ్రంగా విమర్శలు చేస్తుంటే స్పీకర్‌కు అవి వినబడడంలేదా? అని వైసీపీ సభ్యులు ప్రశ్నించారు.
 
శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ ఈ మూడు నెలల్లో ఎంత మంది సభ్యులు చనిపోయారో వాటిపైనే చర్చ జరుపుదామంటే పాత కేసులన్నీ చర్చలోకి తీసుకువస్తున్నారని మండిపడ్డారు. పరిటాల రవి కేసులో జగన్‌కు ఏ సంబంధం లేదని కోర్టు తేల్చి చెప్పినా జగన్‌ను హంతకుడు, నరరూప రాక్షసుడు అని విమర్శలు చేస్తున్నారని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.