ఎన్టీఆర్ సెంటిమెంట్... తెలంగాణ టీడీపీకి బలం.. బాబుతో దత్తాత్రేయ
తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పార్టీకి ఎన్టీఆర్ సెంటిమెంట్ బలం చేకూరుస్తుందని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అభిప్రాయపడ్డారు. ఆయన ఆదివారం చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు పలు అంశాల పైన చర్చించినట్లుగా తెలుస్తోంది.
ఈ సందర్భంగా దత్తాత్రేయ విలేకర్లతో మాట్లాడుతూ చంద్రబాబుతో భేటీకి ప్రత్యేకత ఏమీ లేదని, మర్యాద పూర్వకంగానే కలిసినట్లు చెప్పారు. కార్మిక సంక్షేమ పథకాల అమలులో ఏపీకి ప్రాధాన్యత ఇవ్వాలని బాబు కోరినట్టు తెలిపారు.
తెలంగాణ ఏర్పాటుకు ముందు, ఆ తర్వాత తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని దేశీయ విభాగానికి ఎన్టీఆర్ పేరు పెట్టే అంశం..
అందుకోసం ఇందిరా పార్కు దగ్గర చేపట్టిన రైతుల దీక్షలు, ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఆ పార్టీ సీనియర్ నేత మంత్రి మోత్కుపల్లి నర్సింహులు చేపట్టిన దీక్షలకు కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా నగరం నలుమూలల నుంచి చాలామంది తరలి వచ్చారు. దీంతో తెలంగాణలో మరింత బలపడేందుకు ఎన్టీఆర్ సెంటిమెంట్ ఉపయోగపడుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయంటున్నారు.