భాగ్యనగరంలో బోనాల పండుగ: పట్టువస్త్రాలు సమర్పించిన కేసీఆర్!
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా జరుపుకునే బోనాల పండుగ భాగ్యనగరంలో అంగరంగ వైభవంగా జరిగింది. పాతబస్తీ లాల్దర్వాజలోని శ్రీ సింహవాహిని దేవాలయం, శ్రీ అక్కన్న మాదన్న దేవాలయంతో పరిసర ప్రాంతాల్లోని అన్ని దేవాలయాల్లో తెల్లవారుఝామున అమ్మవారి అభిషేకం మొదలుకుని ప్రత్యేక పూజాదికాలు ప్రారంభమయ్యాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు ఆదివారం మధ్యాహ్నం లాల్దర్వాజలోని శ్రీ సింహవాహిని దేవాలయానికి చేరుకున్నారు. ఆలయ నిర్వాహణ కమిటీ సభ్యులు కెసిఆర్కు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు.
అనంతరం సిఎం కెసిఆర్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి, శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి దేవాలయం తరపున బంగారు బోనాన్ని సమర్పించారు. అలాగే ప్రభుత్వం తరపున అమ్మవారికి హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి పట్టువస్త్రాలను సమర్పించి పూజలు నిర్వహించారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రులు తాటికొండ రాజయ్య, మహమూద్ అలీలు నగరంలోని వివిధ దేవాలయాలను సందర్శించి బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు.