శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PY REDDY
Last Modified: శనివారం, 20 డిశెంబరు 2014 (14:12 IST)

కోటి పాస్ పోర్టులు.. డిసెంబర్ 31 నాటికి : మధన్ కుమార్ రెడ్డి

పాస్ పోర్టు కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఏ ఒక్కరికి లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదని డిప్యూటీ పాస్ పోర్టు అధికారి మధు కుమార్ రెడ్డి తెలిపారు. డిసెంబర్ 31,2014 నాటికి దేశ వ్యాప్తంగా కోటి మందికి పాసుపోర్టులు ఇవ్వనున్నట్లు వివరించారు. శనివారం తిరుపతి పాసుపోర్టు కార్యాయలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పాసుపోర్టుల పట్ల అవగాహన కల్గించడానికి తాము ప్రత్యేకమైన మేళాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. 
 
ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలోని 18 జిల్లాలో 7 లక్షల మందికి పాసుపోర్టు అందజేస్తున్నామని చెప్పారు. అక్టోబరులో ఏర్పాటు చేసిన మేళా ద్వారా తిరుపతి కేంద్రం నుంచి 3200 మందికి పాసుపోర్టులు అందించినట్లు చెప్పారు. అలాగే విజయవాడ నుంచి 3030, హైదరాబాద్ నుంచి 5000, నిజామాబాద్ నుంచి 3000 మందికి పాసుపోర్టులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. పాసుపోర్టు సేవా కేంద్రాలు ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి చర్యలు చేపడుతున్నాయని చెప్పారు. మరో 40 వేల మందికి పోలీసుల క్లియరెన్సు సర్టిఫికెట్లు అందాల్సి ఉందన్నారు. ఇవి అందగానే వారికి కూడా పాసుపోర్టులు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. దళారులను నమ్మి ఎవ్వరూ మోసపోవాల్సిన అవసరం లేదన్నారు. అలాంటి వారిపై ఫిర్యాదు చేయడానికి 18002581800 ఫోన్ వినియోగించుకోవచ్చునని చెప్పారు. తమ సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉంటారని చెప్పారు. 
 
నేడు రేపు నెల్లూరులో మేళా
 
పాసుపోర్టులపై అవగాహన కలిగించి దరఖాస్తుల స్వీకరణ కోసం నెల్లూరులో రెండు రోజుల పాటు మేళా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ మేళా శని,ఆదివారాలలో జరుగుతుందన్నారు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న వారు అందుకున్న సమాచారం మేరకు 14 రోజుల లోపు అధికారులను సంప్రదించాల్సి ఉంటుందని చెప్పారు. ఈ సమావేశంలో తిరుపతి పాస్ పోర్టు సహాయాధికారి రాం రెడ్డి పాల్గొన్నారు.