గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : గురువారం, 27 ఆగస్టు 2015 (14:21 IST)

ఆపరేషన్ సూదిగాడు...! సిరంజి సైకో కోసం 250 మంది పోలీసుల గాలింపు..!!

పశ్చిమ గోదావరి జిల్లాలో ‘ఆపరేషన్ సూదిగాడు’ జోరుగా సాగుతోంది. దాదాపు 250 మంది పోలీసులు సూదిగాడి కోసం అలుపెరుగక గాలింపు చర్యలు చేపడుతున్నారు. దాదాపుగా 5 మండలాలను జల్లెడపడుతున్నారు. అనుమానం ఉన్న వారందరినీ అదుపులోకి తీసుకుని విచారించి పంపుతున్నారు. ఇంతకీ ఎవరీ సూదిగాడు..? పోలీసులు ఎందుకు వెంటాడుతున్నారు..? 
 
పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకోడేరు, ఉండి తదితర ప్రాంతాలలోని మహిళలను టార్గెట్ చేసిన ఓ సైకో సూది మందుతో బెంబేలెత్తిస్తున్నాడు. మహిళలు కనిపిస్తే చాలు సూది మందు గుచ్చి పరారవుతున్నాడు. ఇప్పటికి ఐదు మందిపై సూది గుచ్చి పరారయ్యాడు. వారందరూ ప్రస్తుతం ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. 
 
ఓ విద్యార్థిని కాలేజీకి వెళ్లుతుండగా ఎదురుపడ్డ సైకో సూది మందు గుచ్చి బైకుపై పరారయ్యాడు. ఆపై మరో స్కూలు బాలిక, మరో మహిళ ఇలా ఇప్పటి వరకూ ఐదు మంది మహిళలు, బాలికలపై సూదితో దాడి చేశారు. అతను పల్సర్, షైన్ మోటారు సైకిల్‌పై సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. 
 
ఇతని దెబ్బకు బిత్తరపోయిన జనం పోలీసులను ఆశ్రయించారు. ఇందులో భాగంగా దాదాపు 250 మంది పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆ ప్రాంతంలోనే సూదిగాడు దాగి ఉండవచ్చునని భావించి గాలింపు చేపట్టారు.