బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 4 మే 2016 (09:25 IST)

జగన్‌ కోళ్లఫారం యజమానిలాంటివాడు.. ఏపీ మంత్రులు పల్లె, పరిటాల

వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రులు పల్లె రఘునాథ రెడ్డి, పరిటాల సునీతలు మరోమారు మాటలతో దాడి చేశారు. జగన్‌ కోళ్లఫారం యజమానిలాంటివాడని.. గింజలు, నీళ్లు పోసి సాకిన తర్వాత బలి తీసుకోవడం ఆయన నైజమని వ్యాఖ్యానించారు. వైకాపాలో చివరకు జగన్‌ మినహా ఏ ఒక్కరూ మిగలరని వారు జోస్యం చెప్పారు.
 
అనంతపురంలో జరిగిన మీడియా సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ గన్‌ పార్టీ ఖాళీ అయిందని.. అందుకే ఖాళీ బిందెలు పట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేలను జగన్‌ నమ్మలేకపోవడం వల్లే వారు పార్టీని వీడుతున్నారన్నారు. అలాంటప్పుడు ప్రజలు ఆయనను ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. 

ఇకపోతే.. రాష్ట్రం ఎన్నో కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నా.. అపర భగీరథుడిలా సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పెట్టుకుని ఆయన పాలన సాగిస్తున్నారనీ తెలిపారు.