శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 27 అక్టోబరు 2014 (19:10 IST)

తెలంగాణ మంత్రులు ఇక అబద్ధాల సీరియల్‌ను ఆపండి!: పరకాల ఫైర్

తెలంగాణ మంత్రులు అబద్ధాలను సీరియల్‌గా చెబుతున్నారని.. వీటిని ఆపాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక సలహాదారు పరకాల ప్రభాకర్ మండిపడ్డారు. జల వివాదంపై పరకాల సోమవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. 233 జీవోలో ఎక్కడా 834 అడుగుల వరకు నీటిని వాడుకోవచ్చన్న పదమేలేదని ఆయన స్పష్టం చేశారు. '69 జీవో'లో చెప్పిన అంశాన్నే '233 జీవో'లో నొక్కి చెప్పారన్న విషయాన్ని ఆయన గుర్తించాలని కోరారు. 
 
చెప్పిన అబద్ధాలనే తెలంగాణ నేతలు మళ్లీ మళ్లీ చెబుతున్నారని, తెలంగాణ మంత్రి హరీష్ రావు విషయాన్ని మసిపూసి మారేడుకాయ చేయాలని చూస్తున్నారన్నారు. ఇంగ్లిష్ భాషా పండితులైన హరీష్ రావుగారే మరోసారి జీవోను చదువుకోవాలని సూచించారు. 107 జీవోకు, 170 జీవోకు మధ్య తేడా హరీష్ రావుకు తెలియదా? అని ఆయన ప్రశ్నించారు. 
 
ఏదో ఒక పేపర్ తీసుకువచ్చి ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు మాట్లాడితే నిజమైపోతుందా? అని పరకాల నిలదీశారు. కాసేపు సాగునీరు, తాగునీరు, విద్యుత్... ఇలా ప్రతి అంశంపై ఏదో ఒక వివాదం రాజేయడమే పనిగా పెట్టుకున్నారని పరకాల మండిపడ్డారు.