మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PY REDDY
Last Updated : గురువారం, 18 డిశెంబరు 2014 (10:14 IST)

పెళ్ళి చేసుకున్నందుకు.. ప్రియుడిపై దాడి.. ప్రియురాలి కిడ్నాప్..!!

హీరో ఇంటిపై హీరోయిన్ తండ్రి కర్రలు, కత్తులతో దాడి చేశాడు. హీరోయిన్ ఎత్తుకుపోయారు. పోలీసు స్టేషన్ కు వెళ్ళితే వారు పట్టించుకోరు.. కిడ్నాప్ అయిన హీరోయిన్ ఎక్కడుటుందో తెలియదు... ఇవన్నీ చాలా సినిమాల్లో కనిపించే దృశ్యాలే.. కానీ ఇవే దృశ్యాలు నిజ జీవితంలో విశాఖనగరం గాజువాకలో చోటు చేసుకున్నాయి. 
 
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన ప్రముఖ రాజకీయ పార్టీ నేత కుమార్తె రామినీడి పూజా సరస్వతి, చింత రాజేష్ ఒక కళాశాలలో లెక్చరర్లుగా పనిచేసేటప్పుడు పరిచయమయి ప్రేమించుకుంటున్నారు. రాజేష్ కు విశాఖపట్నంలోని గాజువాక సమీపాన ఒక ప్రయివేటు కళాశాలలో అవకాశం రావడంతో లెక్చరర్‌గా అక్కడ పనిచేస్తున్నాడు.  సరస్వతికి ఆమె తల్లిదండ్రులు వివాహ ప్రయత్నాలు చేస్తుండటంతో రాజేష్‌ను సంప్రదించి వెంటనే పెళ్లి చేసుకోమని కోరింది.
 
పెళ్లికి రాజేష్ తల్లిదండ్రులు అంగీకరించారు. ఈ నెల 12న సింహాచలం దేవస్థానంలో ప్రేమికులు పెళ్లి చేసుకుని వివాహాన్ని రిజిస్టర్ చేయించారు. మొదట సరస్వతి తల్లిదండ్రులు మౌనం వహించారు. కానీ సరస్వతి తండ్రి  ఈ నెల 15న ఉదయం 6.15 గంటలకు 30 మంది మూడు వాహనాలలో వచ్చి గాజువాక చట్టివానిపాలెంలో ఉంటున్న రాజేష్ ఇంటిపై దాడి చేశారు. రాజేష్ ను గాయపరిచారు. సరస్వతిని ఇన్నోవా కారులో తీసుకెళ్లిపోయారు.
 
రాజేష్ గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. ఎలాంటి కేసు నమోదు చేయలేదు. ఎందుకయ్యా పెద్దోళ్లతో అంటూ ఉచిత సలహా కూడా ఇచ్చారు. ఇద్దరూ మేజర్లమనీ చెప్పడంతో వివాహ సర్టిఫికెట్, ఫొటోలు తీసుకొని దర్యాప్తు చేపడతామని చెప్పి పంపేశారు. తన భార్య సరస్వతిని తనకు అప్పగించాలని రాజేష్ కోరుతున్నాడు.