అమ్మ క్యాంటీన్లో ఫుడ్ టేస్ట్ చేసిన పరిటాల సునీత: అన్న క్యాంటీన్ కోసం..!
అమ్మ క్యాంటీన్లకు క్రేజ్ పెరిగిపోయింది. తమిళనాడు సీఎం జయలలిత ప్రారంభించిన చౌక ధరకే ఆహార అమ్మకం పథకాన్ని ఇతర రాష్ట్రాలు కాపీ కొట్టేస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ రైతు బజార్లలో చౌక ధరకే తెలంగాణ సర్కారు ఆహారం అందిస్తోంది. అయితే ఏపీలో పూర్తిగా అమ్మ క్యాంటీన్ల తరహాలోనే అన్న క్యాంటీన్లు ఏర్పాటు కానున్నాయి.
ఇందులో భాగంగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఏర్పాటు చేసిన అమ్మ క్యాంటీన్లలోని భోజనాన్ని ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత రుచి చూశారు. బుధవారం ఉదయం చెన్నై వచ్చిన సునీత సెంట్రల్ రైల్వేస్టేషన్ సమీపంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వద్ద ఉన్న అమ్మ క్యాంటీన్ను సందర్శించారు.
అక్కడి వంటకాలను రుచిచూసి క్యాంటీన్ పని తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ పథకం పేద, మధ్యతరగతి వారికి ఎంతో ఉపయుక్తంగా ఉందన్నారు. అనంతరం అల్వార్పేటలోని చౌకధరల దుకాణాన్ని మంత్రి సందర్శించారు. పీడీఎస్తోపాటు ఇతర సరుకులను కూడా అక్కడ విక్రయిస్తున్నారు. పౌరసరఫరాల శాఖ గోడౌన్లను కూడా మంత్రి పరిశీలించారు. వీటిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నివేదిక ఇస్తానని సునీత చెప్పారు. ఇంకా అమ్మ భోజనం బాగుందన్నారు.