నెల్లూరు : రైలు బోగీలో మంటలు... విద్రోహ చర్యగా అనుమానం!
ఇటీవల నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట రైల్వే స్టేషన్లో చెన్నై నుంచి బిట్రగుంట వెళ్తున్న ప్యాసింజర్ రైలు బోగీలు మంటల్లో మాడి మసికావడం వెనుక విద్రోహుల హస్తం ఉండవచ్చని ఫోరెన్సిక్ నిపుణులు ఓ ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన బోగీలను శుక్రవారం ఫోరెన్సిక్ నిపుణులు క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ పరిశీలనలో ఓ రైలు బోగీ మధ్యలో పెద్ద రంధ్రం చేసి ఉండటాన్ని వారు గుర్తించారు. దీంతో, ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ కాదని, విద్రోహ చర్యేనని ఫోరెన్సిక్ నిపుణులు నిర్ధారణకు వచ్చారు. ఈ విషయంపై అధికారులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. ఈ ప్రమాదంలో రెండు బోగీలు పూర్తిగా కాలిపోగా, ప్రాణనష్టం ఏమీ జరగలేదు. స్టేషన్ ఫ్లాట్ ఫాంకు సమీపిస్తున్న సమయంలో బోగీ నుంచి మంటలు చెలరేగిన విషయం తెల్సిందే.