10 మంది పవన్ కళ్యాణ్ అభిమానుల అరెస్టు.. భీమవరంలో మళ్లీ ఉద్రిక్తత
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్కు చెందిన 10 మంది అభిమానులను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. దీంతో భీమవరంలో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. పవన్ పుట్టినరోజు సందర్భంగా తమ అభిమాన హీరోకు ఫ్యాన్స్ భారీ కటౌట్లు, ఫ్లెక్సీలను ఏర్పాటుచేశారు. వీటిని రాత్రికిరాత్రే గుర్తు తెలియని వ్యక్తులు చింపివేశారు. ఈ విషయం తెలుసుకున్న పవన్ ఫ్యాన్స్.. అనుమానిత వ్యక్తుల ఆస్తులను ధ్వంసం చేశారు.
ఈ ఆస్తులు నష్టపోయిన వారు మరో టాలీవుడ్ హీరో ప్రభాస్ ఫ్యాన్స్ కావడంతో ఇరు వర్గాల అభిమానులు తలపడ్డారు. ఇది చివరకు రెండు కులాల ఘర్షణగా మారిపోవడంతో ముందు జాగ్రత్తగా భీమవరం పట్టణ వ్యాప్తంగా 144 సెక్షన్ విధించి, కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఈ విచారణలో భాగంగా పవన్ కల్యాణ్ అభిమానులు 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న మిగిలిన పవన్ ఫ్యాన్స్.. పోలీసు స్టేషన్ను ముట్టడించారు. అసలు నిందితులను వదిలివేసి.. తమను అరెస్టు చేశారంటూ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో శనివారం ఉదయం భీమవరంలో మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.