బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 28 జనవరి 2015 (10:04 IST)

రాజకీయాలు వద్దు.. సమాజ సేవే ముఖ్యం : పవన్ కళ్యాణ్

తనకు రాజకీయాలు ముఖ్యం కాదని, సమాజ సేవే ముఖ్యమని జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ వెల్లించారు. ఒక తరం నేతలు చేసిన తప్పు వల్ల రాష్ట్రం రెండు ముక్కలైందన్నారు. శ్రీకాకుళం జిల్లా రాజాం పర్యటనలో భాగంగా ఆయన  25 రాష్ట్రాలకు చెందిన విద్యార్థులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినిమాల్లో నీతి చెప్పడం చాలా తేలికని, ప్రతి ఒక్కరూ విద్యావంతులైతేనే సమాజంలో మార్పు సాధ్యమవుతుందన్నారు. అమ్మాయిలపై దాడులను యువత తిప్పి కొట్టాలని పవర్‌స్టార్‌ పిలుపు నిచ్చారు. తనకు రాజకీయాలు ముఖ్యం కాదని, సమాజసేవే ముఖ్యమని పవన్‌ స్పష్టం చేశారు.
 
అలాగే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన స్వచ్ఛ భారత్ విజయానికి అందరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా పరిశుభ్రత ఒక్కరి వల్లనే సాధ్యం కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఆడపిల్లకు భద్రత ఉండే సమాజం కావాలన్నారు. ఆడపిల్లలు ధైర్యంగా బయటకు వెళ్లాలని ఆకాంక్షించారు. ఎవరైనా తప్పు చేస్తే నిలదీయగలిగే సత్తా విద్యార్థుల్లో రావాలని చెప్పారు. సొంత ఊరిని, కన్నతల్లిని ఎవరూ మరువకూడదన్నారు.