గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 21 నవంబరు 2014 (15:40 IST)

కేసీఆరూ.. నీకు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆరే: పెద్దిరెడ్డి

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టాలన్న కేంద్ర నిర్ణయం తెలంగాణలో రాజకీయంగా వేడి పుట్టిస్తోంది. ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని శాసనసభలో తెలంగాణ సీఎం కేసీఆర్ అనడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. 
 
ఇందులో భాగంగా కేసీఆర్‌పై పెద్దిరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్ రాజకీయ భిక్ష పెట్టినందుకే కేసీఆర్ తన కుమారుడికి తారక రామారావు అని పేరు పెట్టుకున్నారని పెద్దిరెడ్డి అన్నారు. కేసీఆర్, కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డికి రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆరే అని... అయినా ఎన్టీఆర్ పేరుపై వీరిద్దరూ దివాళాకోరు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. 
 
ఎన్టీఆర్‌ను అసహ్యించుకుంటున్న కేసీఆర్... ముందు తన కుమారుడి పేరు మార్చి, ఆ తర్వాత మాట్లాడాలని పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దివంగత ఎన్టీఆర్ తెలుగు ప్రజలకు ఆరాధ్యదైవమని, దేశానికి 1947లో స్వాతంత్ర్యం వస్తే, తెలుగువారికి ఎన్టీఆర్ హయాంలోనే స్వాతంత్ర్యం వచ్చిందని చెప్పారు.