ప్రపంచంలో అత్యంత కాలుష్య ప్రాంతం తాండూరు.. ఢిల్లీ కంటే రెట్టింపు!
నిజానికి భారతదేశంలోనే అత్యంత కాలుష్య నగరం ఏదంటే.. ఢిల్లీ అని ఠకీమని చెప్పేస్తాం. అయితే ఢిల్లీ కంటే రెట్టింపుస్థాయి కాలుష్య నగరిగా తాజాగా తాండూరును గుర్తించారు. జాతీయ కాలుష్య నియంత్రణ మండలి నివేదిక ప్రకారం ప్రపంచంలోనే తాండూరు అత్యంత కాలుష్య నగరంగా చెప్పవచ్చు.
జాతీయ వాయు నాణ్యత ప్రకారం క్యూబిక్ మీటర్కు 100 మిల్లీ గ్రాములు ఉండాల్సిన సూక్ష్మ ధూళి కణాలు తాండూరులో 622 మిల్లీ గ్రాములు ఉన్నట్లు గుర్తించారు. ఢిల్లీలో 359 మిల్లీ గ్రాములకే గగ్గోలు పెడుతుంటే.. తాండూరులో పరిస్థితి ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అన్ని రకాల సూక్ష్మ ధూళి కణాలు కలిపితే ఇక్కడ క్యూబిక్ మీటరుకు 1958 మిల్లీ గ్రాములు ఉన్నట్లుగా కాలుష్య నియంత్రణ మండలి రిపోర్టు ఇచ్చింది.
తాండూరు సమీపంలో ప్రభుత్వ సిమెంట్ కర్మాగారం, ఇండియా సిమెంట్స్, పెన్నా సిమెంట్ కర్మాగారాల తోపాటు సరిహద్దులోని కర్ణాటకలో చెట్టినాడు, వికాట్ సాగర్ సిమెంట్ కర్మాగారాలు ఉన్నాయి. ఇక నాపరాయి, సుద్ద, పాలిషింగ్ మిషన్లు ఉండటంతో ఇక్కడ ప్రతిరోజు సిమెంటు, సుద్ద, ఎర్రమట్టి, జిప్సం, బొగ్గుతో కూడిన సుమారు 5వేల వరకు లారీలు ఎలాంటి రక్షణ లేకుండా రాకపోకలు సాగిస్తుంటాయి.
ఇక్కడ కాలుష్యం పెరిగిపోతోందని గతేడాది జూలైలో తాండూరు పట్టణ సిటిజెన్ వెల్ఫేర్ ఫోరం కన్వీనర్, ప్రముఖ వ్యాపారి రాజ్గోపాల్ సార్డా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలికి ఫిర్యాదు చేశారు. ఐదు నెలలైనా స్పందించకపోవడంతో ఆయన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.