శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 25 అక్టోబరు 2014 (11:28 IST)

శ్రీశైలం డ్యామ్ వివాదం మళ్లీ మొదటికొచ్చిందోచ్!

శ్రీశైలం డ్యామ్‌వద్ద విద్యుదుత్పత్తి వివాదం మళ్లీ మొదటికి వచ్చింది. శ్రీశైలం డ్యామ్ వద్ద తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తికి బ్రేక్ పడలేదు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న విద్యుదుత్పత్తికి వ్యతిరేకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా రివర్ బోర్డుకు, కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శికి ఫిర్యాదులు చేసింది.

దీంతో కృష్ణా బోర్డు చైర్మన్ ఎస్‌కె పండిట్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. కృష్ణా బోర్డు కార్యదర్శి కూడా తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాస్తూ గతంలో జారీ చేసిన 69, 107 నంబర్ల జీవోలను గౌరవించాల్సిందేనని స్పష్టం చేసింది.
 
తాజా పరిణామాల నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం శనివారం ఉన్నత స్ధాయిసమావేశంలో శ్రీశైలం విద్యుత్ విషయంలో తెలంగాణ అనుసరిస్తున్న వైఖరికి చెక్ పెట్టేందుకు కార్యాచరణను ఖరారు చేయనుంది.
 
854 అడుగులు నీటి మట్టం వరకు శ్రీశైలం ఎడమగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేయడానికి వీలుంది. అంతవరకు తాము విద్యుదుత్పత్తిని ఆపేది లేదని తెలంగాణ ప్రభుత్వం తెగేసి చెప్పింది. అయితే, విద్యుదుత్పత్తి కొనసాగించడం వల్ల నీట మట్టం తగ్గితే రాయలసీమ హక్కులకు భంగం వాటిల్లుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదిస్తోంది.
 
రాయలసీమకు తాగునీరు అందించేందుకు శ్రీశైలంలో కుడిగట్టు విద్యుదుత్పత్తి నిలిపివేయాలని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే గత 18నుంచి విద్యుదుత్పత్తిని నిలిపివేసిన అధికారులు, తెలంగాణ పరిధిలోని ఎడమ కేంద్రం నుంచీ విద్యుదుత్పత్తి నిలిపివేయాలని కోరారు. దీనికి ససేమిరా అన్న తెలంగాణ ప్రభుత్వం ప్రతి రోజూ ఉత్పత్తిని కొనసాగిస్తూనే ఉంది.