గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 28 ఫిబ్రవరి 2017 (09:04 IST)

ఒక్క రాత్రి గడిపితే రూ.లక్ష... ఆఫర్ తిరస్కరిస్తే ఫెయిల్.. విద్యార్థినులకు ప్రొఫెసర్ల మెసేజ్‌లు

సభ్యసమాజం తలదించుకునే చర్యలకు ముగ్గురు ప్రొఫెసర్లు ఒడిగట్టారు. విద్యాబుద్ధులతో విద్యార్థులను ప్రయోజకులను చేయాల్సిన పవిత్రమైన వృత్తిలో ఉన్న ఆ కామాంధక అధ్యాపకులు తమ వద్ద చదువుకునే విద్యార్థినులను తమ లైం

సభ్యసమాజం తలదించుకునే చర్యలకు ముగ్గురు ప్రొఫెసర్లు ఒడిగట్టారు. విద్యాబుద్ధులతో విద్యార్థులను ప్రయోజకులను చేయాల్సిన పవిత్రమైన వృత్తిలో ఉన్న ఆ కామాంధక అధ్యాపకులు తమ వద్ద చదువుకునే విద్యార్థినులను తమ లైంగికవాంఛ తీర్చాలంటూ వేధించారు. ఒక్క రాత్రి గడిపితే రూ.లక్ష ఇస్తామని, కాదని మొండికేస్తే పరీక్షల్లో ఫెయిల్ చేస్తామంటూ బెదిరించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
హైదరాబాద్ నగర శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌లోని బ్రిలియంట్‌ ఇంజనీరింగ్‌ కళాశాల ఉంది. ఇక్కడ ఎగ్జామినేషన్‌ బ్రాంచ్‌ హెచ్‌వోడీ సైదిరెడ్డి వెన్న, డిప్లొమా ఇన్‌చార్జి గోపి, స్కాలర్‌షిప్‌ ఇన్‌చార్జి ఉస్మాన్‌లు విధులు నిర్వహిస్తున్నారు. వీరు గత కొన్ని నెలలుగా కొందరు విద్యార్థినులను లైంగికంగా వేధిస్తూ వచ్చారు. ఇపుడు వార్షిక పరీక్షల సమయం సమీపించడంతో వారు వేధింపులు ఎక్కువయ్యాయి. ఇంతకాలం వారి వేధింపులను భరిస్తూ వచ్చిన ఆ విద్యార్థినులు... స్నేహితుల సూచనతో ఏబీవీపీ నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ కీచక ప్రొఫెసర్ల బండారం బట్టబయలైంది. 
 
ఈ ముగ్గురు ప్రొఫెసర్లు ఫేస్‌బుక్‌, వాట్స్‌పలో పంపిన సందేశాలను హైదరాబాద్ నగర షీటీమ్స్‌కు వారు అందజేశారు. 'నువ్వు ఇంజనీరింగ్‌ పాస్‌ కావాలంటే నేను చెప్పినట్టు చేయాలి. లేకపోతే నీ భవిష్యత్తు అంధకారమే. లైంగిక వాంఛ తీర్చితే రూ.లక్ష ఇస్తా. అంతేకాదు.. ఇంజనీరింగ్‌ పట్టాకూడా నీ చేతిలో ఉంటుంది.' అని సదరు ప్రొఫెసర్లు ఫేస్‌బుక్‌, వాట్స్‌పలో సందేశాలు పంపినట్టు ఆ విద్యార్థినులు పోలీసులకు వెల్లడించారు. 
 
కాగా వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచుతామని, తల్లిదండ్రులకు కూడా చెప్పమని షీటీమ్స్‌ మాట ఇవ్వడంతోనే కీచక ప్రొఫెసర్లపై ఫిర్యాదు చేసేందుకు బాధిత విద్యార్థినులు ముందుకొచ్చారు. అయితే సదరు ప్రొఫెసర్లపై గతంలోనే కొందరు విద్యార్థులు కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో ఆ ముగ్గురు ప్రొఫెసర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.