శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 28 మార్చి 2015 (18:15 IST)

పీఎస్‌ఎల్‌వీ సీ-27 రాకెట్‌ ప్రయోగం గ్రాండ్ సక్సెస్!

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శనివారం ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ సీ-27 రాకెట్‌ ప్రయోగం గ్రాండ్ సక్సెస్‌ను సాధించింది. ఇది భారత నావిగేషన్ వ్యవస్థకు ఎంతగానో తోడ్పాటును అందించనుంది. ఈ ప్రయోగంతో ఐఆర్ఎన్ఎస్ఎస్ 1డి ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ సి27 రాకెట్ విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. 
 
కొద్ది సేపటి క్రితం నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ రాకెట్ వివిధ దశలను విజయవంతంగా అధిగమించింది. సొంత నావిగేషన్ వ్యవస్థతో అమెరికాతో సమానంగా సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రానుంది. విపత్తులను గుర్తించడం, నౌకలు, వాహనాల రాకపోకలను తెలుసుకోవడం ఈ నావిగేషన్ వ్యవస్థ ద్వారా సాధ్యమవుతుంది. 
 
భారత నావిగేషన్ వ్యవస్థ కోసం మొత్తం ఏడు ఉపగ్రహాలు అవసరం కాగా, ఇప్పటికి నాలుగు ఉపగ్రహాలను నింగిలోకి పంపారు. మిగిలిన మూడింటిని కూడా ఈ ఏడాదే ప్రయోగిస్తామని ఇస్రో ఛైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్ తెలిపారు. ఈ ప్రాజెక్టులో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలు అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయంతో మరోసారి సత్తా చాటామన్నారు. 
 
పీఎస్ఎల్వీ‌సి 27 ప్రయోగం విజయవంతం కావడంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు. ప్రాజెక్టులో పాల్గొన్న ఇస్రో శాస్త్రవేత్తలకు ఆయన అభినందనలు తెలిపారు. ఐఆర్ఎన్ఎస్ఎస్ 1డి విజయవంతంగా కక్ష్యలో ప్రవేశించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.