గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : సోమవారం, 25 మే 2015 (11:02 IST)

సెల్ ఫోన్ సైకోలు..! బెజవాడలో మహిళలు ఫోన్ తీస్తే ఒట్టు..!!

సెల్ మోగుతోందంటే విజయవాడలో మహిళల గుండెల్లో రైళ్ళు పరిగెడుతాయి. అది ఒకవేళ పరిచయం లేని నంబరైతే ఇక హడలిపోతారు. మెస్సేజ్ వచ్చిందంటే ఏ బూతు చదవాల్సి వస్తుందోనని బిక్కచిక్కి పోతుంటారు. బెజవాడ జనారణ్యంలో సెల్ ఫోన్ సైకోలు వీరవిహారం చేస్తున్నారు. పురుషులు కూడా సిగ్గుపడే స్థాయిలోని పరూష పదజాలాన్ని వినియోగిస్తూ ఎస్ఎంఎస్ లు పంపుతుంటారు. ఇక ఫోన్ తీస్తే బూతు పురాణమే.. ఇలా ఒకటి కాదు రెండు కాదు కొన్ని వేల ఫోన్.. విజయవాడలో మోగుతూనే ఉంటాయి. ఎస్ఎంఎస్ లు వస్తూనే ఉంటాయి. వివరాలిలా ఉన్నాయి. 
 
ప్రస్తుతం కిరాణా దుకాణానికి వెళ్లి సరుకులు తెచ్చుకున్నంత సులువుగా సిమ్‌ కార్డు తెచ్చుకునే సౌలభ్యాన్ని నెట్‌వర్క్‌ కంపెనీలు కల్పిస్తున్నాయి. నిబంధనలు గతంలో కన్నా కఠినతరం చేసినప్పటికీ, కనెక్షన్లు పెంచితే వచ్చే ఆదాయానికి ఆశపడే కొందరు డీలర్లు వాటికి తూట్లు పొడుస్తున్నారు. ఒక ప్రూఫ్‌నే కలర్‌ జిరాక్స్‌ తీయించి ప్రూఫ్‌ లేని వారి వద్ద నుంచి ఎక్కువ డబ్బులు తీసుకుని ఇచ్చేస్తున్నారు. దీంతో నకిలీ ప్రూఫ్‌ ద్వారా సిమ్‌ కార్డులను తీసుకుంటున్న అగంతుకులు అమ్మాయిలతో ఆడుకుంటున్నారు. కాల్స్‌ చేస్తూ.. మెసేజ్‌లు పంపుతూ.. అశ్లీల సాహిత్యాన్ని వారికి పంపుతూ రాక్షసానందాన్ని పొందుతున్నారు. సెల్ ఫోన్ సైకోలుగా మారిపోతున్నారు. 
 
ఇటీవల నగరానికి చెందిన ఒక యువకుడు ఒకే నంబర్‌తో ఆరుగురు మహిళలకు కాల్స్‌ చేసే వాడు. అంతేకాక ఫలానా ప్రదేశానికి రావాలని, లేకుంటే.. పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించేవాడు. నిత్యం ఫోన్లు చేసి అసభ్య పదజాలంతో దూషించడం, వేధించడం చేసేవాడు. అతడు రమ్మన్న ప్రదేశానికి వెళ్తే కనిపించేవాడు కాదు. దీంతో విసిగిపోయిన మహిళల కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులను సైతం ముప్పుతిప్పలు పెట్టిన అతడు ఇప్పుడు కటకటాలు లెక్కపెడుతున్నాడు. అయితే ఈ ఘటనలో ముఖ్యమైన మలుపేమిటంటే.. ఆ ఆరుగురు మహిళలు ఫోన్‌ చేస్తున్న వ్యక్తిని కనీసం ఒక్కసారి కూడా చూడకపోవడం. అతణ్ని పట్టుకున్న పోలీసులకు ఫోన్లు చేసి ఎదుటివారిని వేధించడం ద్వారా తనకు మానసికానందం పొందుతున్నట్లు చెప్పడం విశేషం. 
 
గత కొంత కాలంగా ఇటువంటి కేసులు, సంఘటనలు పెరిగిపోవడంతో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. రంగంలోకి దిగిన వారికి ఇలా సైకో కేసులు చాలా ఉన్నట్లు తేలుతోంది. దీంతో పోలీసులు కూడా నిర్ఘాంతపోయారు. వీరి చేష్టంలు మితిమీరిపోవడంతో తాము కైడా సైబర్‌ విభాగాన్ని కూడా బలోపేతం చేసి ఆధునిక సాంకేతిక పరికరాలను సమకూర్చుకునేందుకు కమిషనరేట్‌ ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నారు.