గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 15 సెప్టెంబరు 2014 (18:32 IST)

టీడీపీలోకి చేరేందుకు సిద్ధమే : పురంధేశ్వరి మనస్సులో మాట!

టీడీపీలో చేరేందుకు తాము సిద్ధమేనని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ మహిళా నేత పురంధేశ్వరి చెప్పారు. దీంతో రాజకీయాల్లో శాశ్వత శత్రువులు... శాశ్వత మిత్రులు ఉండరనే సామెతను ఆమె మరోమారు రుజువు చేయనున్నారు. తాజాగా హస్తానికి చేయిచ్చి, కమలం చేతబట్టిన మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరి చూపు ఇపుడు తండ్రి స్థాపించిన టీడీపీపై పడినట్లు తెలుస్తోంది. 
 
టీడీపీలోకి వచ్చేందుకు తాము కూడా సానుకూలంగానే ఉన్నామని, అయితే అందుకు పరిస్థితులు అనుకూలించాలని దగ్గుబాటి దంపతులు చెప్పడమే ఇందుకు కారణం. ప్రవాసాంధ్రులు నిర్వహించిన ఓ సమావేశంలో వారు ఈ విధంగా స్పందించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో మంత్రి పదవిని వదులుకుని మరీ... కాషాయ కండువా కప్పుకున్న ఆమె అక్కడ గౌరవం ఉంటుందని ఆశించారు. దాంతో తాను ఆశించిన చోట టిక్కెట్టు కూడా దక్కుతుందని భావించారు. అయితే ఆమె అంచనాలు తల్లకిందులయ్యాయి. 
 
రాష్ట్రంలో బీజేపీతో టీడీపీ ఎన్నికల పొత్తు కుదుర్చుకోవడంతో ఆమె ఆశలపై నీళ్లు చల్లాయి. పొత్తుల్లో భాగంగా కడప జిల్లా రాజంపేట లోక్‌సభ బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత నుంచి ఆమె పార్టీకి కొంచెం దూరంగానే ఉంటున్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న చిన్నమ్మ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.