శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 1 ఆగస్టు 2015 (16:20 IST)

ప్రత్యేక హోదా ఏపీ హక్కు.. పోరాటానికి సిద్ధంకండి : ఏపీ నేతలకు రాహుల్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దృష్టిసారించారు. ఇందులోభాగంగా ఆయన ప్రత్యేక హోదాపై గళం విప్పారు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అని ఆయన నినందించారు. ఇందుకోసం ఎంతవరకైనా పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన ప్రకటించారు. ఇదే అంశంపై ఆయన శనివారం మధ్యాహ్నం ఏపీ పీసీసీ చీఫ్ ఎన్. రఘువీరా రెడ్డికి రాహుల్ ఫోన్ చేసి మాట్లాడారు. 
 
14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రాలకు కేంద్ర పన్నుల వాటా పెంచడం జరిగిందని, అందువల్ల దేశంలో ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇచ్చేది లేదనీ, కేవలం ప్రత్యేక ప్యాకేజీలు మాత్రమే ఇస్తామని కేంద్ర ప్రణాళికా శాఖామంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ శుక్రవారం లోక్‌సభలో స్పష్టం చేశారు. దీంతో ఏపీకి ప్రత్యేక హోదా కూడా రాదని తేలిపోయింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ పార్టీల్లో మాటలయుద్ధం ఆరంభమైంది. 
 
ఈ నేపథ్యంలో శనివారం ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డికి రాహుల్ ఫోన్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై ఆయన రఘువీరాతో చర్చించారు. ప్రత్యేక హోదా సాధించుకోవడం ఏపీ హక్కు అని ఈ సందర్భంగా రాహుల్ పేర్కొన్నారు. ఈ విషయమై ఏపీకి చెందిన రాజ్యసభ సభ్యులతో సోమవారం సమావేశం కావాలని రాహుల్ నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని రఘువీరాకు తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై జాతీయస్థాయిలో కార్యాచరణ రూపొందిస్తున్నామని, ఏపీ కాంగ్రెస్ నేతలు సిద్ధం కావాలని రాహుల్ ఆదేశించారు. దీంతో రఘువీరా రెడ్డి తనకు అందుబాటులో ఉన్న నేతలతో సమావేశం నిర్వహించి సమీక్ష చేయనున్నారు.