మెదక్ ట్రైన్ యాక్సిడెంట్: 18కి చేరిన మృతులు, వైష్ణవి మృతి!
మెదక్ జిల్లా మాసాయిపేట రైలు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో చిన్నారి మృతి చెందింది. సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైష్ణవి(11) మంగళవారం ఉదయం 5.30గంటలకు తుది శ్వాస విడిచింది. దీంతో మాసాయిపేట రైలు ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 18కి చేరింది.
ఆరో తరగతి చదువుతున్న వైష్ణవి స్వస్థలం మెదక్ జిల్లా ఇస్లాంపూర్. వైష్ణవి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి మార్చురీకి తరలించారు. గత ఆరు రోజులుగా యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైష్ణమృతి చెందడంతో కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.
యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ప్రశాంత్, వరుణ్ గౌడ్ల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. నితూష, శరత్ల పరిస్థితి కూడా కొంత ఆందోళనకరంగా ఉందని చెప్పారు. మిగిలిన 14మంది చిన్నారులు కోలుకుంటున్నారు. కాగా, యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి తరుణ్ (7) సోమవారం మృతి చెందాడు.