రాజయ్య బర్తరఫ్పై నోరెత్తని టీఆర్ఎస్.. గప్చుప్..!
తెలంగాణ సీఎం కేసీఆర్ తన మంత్రివర్గం నుంచి డిప్యూటీ సీఎం టి. రాజయ్యను బర్తరఫ్ చేయడంపై టీఆర్ఎస్ వర్గాలు నోరెత్తకుండా గప్చుప్ మంటూ వ్యవహరిస్తున్నాయి. ఈ విషయంలో సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ పార్టీ ముఖ్య నేతలెవరూ ఇప్పటివరకు ప్రకటన చేయకపోవటం చర్చనీయాంశంగా మారింది.
సీఎం కేసీఆర్ ఆదివారం తన కేబినెట్ నుంచి ఉప ముఖ్యమంత్రి రాజయ్యను బర్తరఫ్ చేసి, ఆయన స్థానంలో కడియం శ్రీహరిని మంత్రివర్గంలోకి నేపథ్యంలో.. సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని తప్పుపడుతూ విపక్షాల నుంచి మొదలైన విమర్శల జడివాన రోజురోజుకూ ఉధృతమవుతోంది.
అయితే ఆ విమర్శలకు ‘గులాబీ’ దండు దీటైన జవాబు ఇచ్చే ప్రయత్నం చేయకుండా, మౌనం వహించడం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.
మరోవైపు తాము చేసిన పొరపాటు ఏమిటో తేల్చాలని, తప్పకుండా విచారణ జరిపించాలని ఉద్వాసనకు గురైన ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు విజ్ఞప్తి చేశారు. విచారణ జరిపితే కడిగిన ముత్యంలా బయటికి వస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం రాజయ్య ఆకస్మికంగా అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే.