శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , సోమవారం, 15 మే 2017 (02:34 IST)

నాలుగు రూపాయలకే పేదలకు ఫుల్ మీల్స్ అట... కనీసం ఆ సహాయమైనా చేయండి

పేదలకు, నిరుపేదలకు బతుకు అవకాశాలు అందించే కర్తవ్యాన్ని పాలకులు, పాలక పక్షాలూ ఏనాడో వదిలేశాయి. జీవితంలో పైకి వచ్చే మార్గాలను చూపలేని, వెతకలేని పాలకులు చివరకు ప్రజా సంక్షేమం పేరుతో అమ్మ క్యాంటీన్లు, అన్

పేదలకు, నిరుపేదలకు బతుకు అవకాశాలు అందించే కర్తవ్యాన్ని పాలకులు, పాలక పక్షాలూ ఏనాడో వదిలేశాయి. జీవితంలో పైకి వచ్చే మార్గాలను చూపలేని, వెతకలేని పాలకులు చివరకు ప్రజా సంక్షేమం పేరుతో అమ్మ క్యాంటీన్లు, అన్న క్యాంటీన్లు అన్నపూర్ణ క్యాంటీన్లు అంటూ సంక్షేమానికి కొత్త అర్థం చెబుతున్నారు. ఇలా రూపాయికి ఇడ్లీలు, చపాతీలు, సాంబారన్నం పెరుగన్నం వంటివి అతిచౌక ధరలకు అందించడం దేశంలో రిజర్వేషన్ల లెక్కలాగా మారుతోంది. రిజర్వేషన్లు దేశంలో దళితులలో, ఎస్టీలలో ఒక క్రీమీ వర్గాన్ని తయారు చేయడం తప్ప ఈ వర్గాల్లో మౌలిక మార్పు తేలేకపోయాయన్నది ఎంత చేదు నిజమో పేదలను తమ కాళ్లమీద తాము నిలబడేలా చేయని ఇలాంటి కారుచౌక భోజన పథకాలు పేదలను శాశ్వతంగా పేదలుగానే ఉంచే ప్రమాదకర పరిస్థితులను సృష్టిస్తున్నాయి.

ఈ చేదు వాస్తవం కళ్లముందు కనిపిస్తున్నప్పటికీ 60 లేదా 70 రూపాయలు పెట్టి ఒక పూట భోజనం తినలేని కోట్లాది మంది నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలకు ఈ తరహా అమ్మ, అన్న క్యాంటీన్లు స్వర్గాన్ని తమ ముందుకు తీసుకువచ్చి వదులుతున్నట్లే కనిపిస్తున్నాయి. ఈ కోవలో వచ్చిన కొత్త పథకం రాజన్న పథకం. మిగతా పథకాలకంటే చౌకగా కేవలం నాలుగు రూపాయలకే కడుపునిండా భోజనం పెడతామని ఈ కొత్త పథకం ప్రకటిస్తోంది కాబట్టి బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యేటట్టే ఉంది.
 
పేద ప్రజలకు కడుపునిండా రుచికరమైన భోజనం పెట్టాలనే సంకల్పంతో మంగళగిరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) ఆదివారం ‘రాజన్న’ మొబైల్‌ క్యాంటీన్లు ప్రారంభించారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కేవలం నాలుగు రూపాయలకే పేదలకు భోజనాన్ని అందించనున్నారు. 
 
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ.. 2004లో మే 14వ తేదీన మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన దివంగత సీఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి నిరంతరం పేద ప్రజల కోసమే ఆలోచిస్తూ అనేక సంక్షేమ పథకాలు అమలుచేశారని చెప్పారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా రాజన్న క్యాంటీన్‌ పేరుతో భోజనం ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
 
365 రోజులూ ప్రతి పేదవాడికీ శ్రేష్టమైన భోజనం అందేలా తన సొంత నిధులతో ఈ ఏర్పాట్లు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ప్రతి గ్రామంలోనూ, పట్టణంలోనూ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని చెప్పి విస్మరించిందని మండిపడ్డారు. 
 
ప్రభుత్వం కనుక క్యాంటీన్లు ఏర్పాటు చేయకపోతే భవిష్యత్తులో మసీదు సెంటర్‌ వద్ద ప్రతి పేదవాడికీ ఒక్క రూపాయికే నాలుగు ఇడ్లీలు ఇచ్చే పథకం ప్రారంభిస్తానని ఆయన వెల్లడించారు. తమిళనాడు ప్రభుత్వం నిర్వహిస్తున్న క్యాంటీన్లు పరిశీలించడానికి కోట్లాది రూపాయలు వెచ్చించి కమిటీలను పంపించారని, ఇప్పటికి మూడేళ్లు గడిచినా పథకం రూపు దాల్చలేదన్నారు.