మంగళవారం, 19 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 6 ఫిబ్రవరి 2018 (10:04 IST)

పీఎంవోను తాకిన టీడీపీ నిరసన సెగలు.. నేడు మోడీతో ఎంపీల భేటీ

విత్తమంత్రి జైట్లీ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన తీరని అన్యాయంపై అధికార టీడీపీ గళమెత్తింది. ఢిల్లీలోని పార్లమెంట్‌ వేదికగా చేసుకుని టీడీపీ ఎంపీలు నిరసనలు, నోటీసులు, డిమాండ్లు, చ

విత్తమంత్రి జైట్లీ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన తీరని అన్యాయంపై అధికార టీడీపీ గళమెత్తింది. ఢిల్లీలోని పార్లమెంట్‌ వేదికగా చేసుకుని టీడీపీ ఎంపీలు నిరసనలు, నోటీసులు, డిమాండ్లు, చర్చలు... ఇలా అన్ని విధాలుగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. దీంతోపాటు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో చర్చలు జరిపారు. ఫలితంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్యాలయం నుంచి టీడీపీ ఎంపీలకు పిలుపువచ్చింది. దీంతో మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రధాని మోడీతో కేంద్ర సహాయ మంత్రి సుజనా చౌదరితో పాటు.. మరో నలుగురు ఎంపీలు భేటీకానున్నారు. 
 
నిజానికి నవ్యాంధ్రకు న్యాయం జరిగేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు టీడీపీ ఎంపీలు బహుముఖ వ్యూహం మొదలుపెట్టి.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వరం పెంచారు. సోమవారం ఉదయం నుంచే టీడీపీ ఎంపీలు ఢిల్లీలో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించారు. పార్లమెంట్ వేదికగా వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేశారు. ఆ పార్టీ ఎంపీలు లోక్‌సభలో స్వల్ప వ్యవధి చర్చకు నోటీసులు ఇచ్చారు. రాష్ట్రపతి ప్రసంగానికి సవరణలు కోరుతూ నోటీసులు సమర్పించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. 
 
ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామ్య పార్టీగా ఉన్న టీడీపీకి చెందిన ఎంపీలు ఈ తరహా నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో పరిస్థితి చేజారిపోయే అవకాశం ఉందని భావించిన కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రంగంలోకి దిగి టీడీపీ ఎంపీలతో చర్చలు జరిపారు. ఆ తర్వాత చర్చల సారాంశాన్ని ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లారు. ఫలితంగా టీడీపీ ఎంపీలతో భేటీ అయ్యేందుకు ఆయన సముఖత వ్యక్తం చేశారు.