గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 28 మే 2016 (10:54 IST)

రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న ఉత్కంఠ

రాజ్యసభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల దాఖలు గడువు సమీపిస్తున్నప్పటికీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభ్యర్థుల ఎంపిక ఇప్పటివరకు ఒక స్పష్టత రాలేదు. రాష్ట్రంలో నాలుగు స్థానాలు ఖాళీ అవుతుండగా ఇందులో తెలుగుదేశం పార్టీ గెలుచుకునే బలం మూడు స్థానాలకు మాత్రమే ఉంది. కానీ నాలుగు స్థానాలను గెలుచుకోవాలని టీడీపీ పావులు కదుపుతోంది. 
 
గెలుచుకోగలిగే సత్తా ఉన్న మూడు సీట్లలో ఒకటి బీజేపీకి పోతే రెండింటిలో మాత్రం ఆశావహులు అధిక సంఖ్యలో క్యూ కడుతున్నారు. ఈ మూడు సీట్లలో ఆంధ్రప్రదేశ్ కోటా నుంచి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను మళ్లీ రాజ్యసభకు పంపించాలని బీజేపీ కోరుతోంది. 
 
మిగిలిన రెండు సీట్లలో ఒకదాన్ని కేంద్ర మంత్రి సుజనా చౌదరికి కేటాయించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇపుడు మూడో సీటుపైనే ఉత్కంఠ నెలకొంది. ఈ సీటును ఎవరికి కేటాయించాలన్న అంశంపైనే ఇపుడు చర్చ సాగుతోంది. 
 
ప్రస్తుతం సాగుతున్న ప్రచారం మేరకు చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే హేమలత పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. అయితే, ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ కూడా ఈ సీటును ఆశిస్తున్నట్టు సమాచారం. దీంతో చంద్రబాబు ఎవరికి కేటాయిస్తారన్న అంశంపై సందిగ్ధత నెలకొంది.