శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 24 ఫిబ్రవరి 2018 (12:33 IST)

ప్రధాని మోడీ ఏమైనా పెద్ద పోటుగాడా?: ఎంపీ రాయపాటి ప్రశ్న

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ రాయపాటి సాంబశివరావు మండిపడ్డారు. ప్రధానమంత్రిని చూసి కేంద్రమంత్రులు వణికిపోతున్నారని, ప్రధాని ఏమైనా పెద్ద పోటుగాడా అంటూ ప్రశ్నించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ రాయపాటి సాంబశివరావు మండిపడ్డారు. ప్రధానమంత్రిని చూసి కేంద్రమంత్రులు వణికిపోతున్నారని, ప్రధాని ఏమైనా పెద్ద పోటుగాడా అంటూ ప్రశ్నించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీని బీజేపీకి చెందిన నేతలు కూడా వ్యతిరేకిస్తున్నారన్నారు. ఆయనపై సొంత పార్టీలోనే తీవ్ర అసంతృప్తి, వ్యతిరేకతలు ఉన్నాయన్నారు. ప్రత్యేక ప్యాకేజీ పేరుతో ఏపీని మోడీ ప్రభుత్వం మోసం చేస్తోందని మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తేనే బీజేపీని నమ్ముతామని చెప్పారు. 
 
ఇకపోతే తమ పార్టీ అధినేత ఆదేశిస్తే, రాజీనామాలు చేయడానికైనా, కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికైనా తాము సిద్ధమేనన్నారు. బీజేపీతో పొత్తు కొనసాగుతుందా? లేదా? అనే విషయం త్వరలోనే తేలిపోతుందన్నారు. తమ అధినేత చంద్రబాబు మార్గదర్శకాల కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. 
 
అయితే, ఏ క్షణమైనా టీడీపీ - బీజేపీల మధ్య ఉన్న పొత్తు తెగిపోవచ్చని చెప్పారు. ప్రత్యేక హోదా సాధించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని, ఇప్పటి వరకు ప్రధాని ఏపీకి ఇచ్చింది చెంబు నీళ్ళు, ముంతడు మట్టి మినహా ఇంకేముంది బూడిద అంటూ ఫైరయ్యారు. 
 
ఏపీలో జరుగుతున్న పరిస్థితులు మోడీకి తెలుసు. ఎందుకు మౌనంగా ఉన్నారో అర్థం కావడం లేదు. ఇక వేచి చూసే ధోరణి మానుకుంటున్నాం. తిరుగుబావుటాకు సిద్ధమయ్యాం. మా తడాఖా ఏమిటో చూపిస్తామంటూ హెచ్చరించారు. చంద్రబాబు ఎప్పుడు ఏం చేయమన్నాం సిద్ధంగా ఉన్నాం, పార్టీ పదవులు మాకు ముఖ్యం కాదు, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే మాకు ముఖ్యమని రాయపాటి చెప్పుకొచ్చారు.