గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : సోమవారం, 27 జులై 2015 (14:18 IST)

ఎన్ని గుండెలు నీకు..! ఇక్కడికొస్తావా...! దండం పెట్టినా వదలక విఆర్వోపై దాడి...!!

తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రెవెన్యూ అధికారులపై దాడులు పరాకాష్టకు చేరుతున్నాయి. మొన్న ముసునూరు ఘటన.. నిన్న చిన్నగొట్టిగల్లు... నేడు మంగళగిరి ఇలా వరుసదాడులు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడికక్కడ రెవెన్యూ అధికారులపై రాజకీయ అండదండలున్న వ్యక్తులు దాడులు చేస్తూనే ఉన్నారు. ఓ గ్రామ రెవెన్యూ అధికారి దండం పెడుతున్నా రియల్టర్లు దాడి చేసిన సంఘటన ఆదివారం వెలుగు చూసింది. దీంతో రెవెన్యూ సంఘాలు ఉద్యమ బాట పట్టాయి. ఉద్యోగాలు చేయడం సాధ్యం కాదని తేల్చి చెబుతున్నాయి.. 
 
గుంటూరు జిల్లా మంగళగిరి‌లో ఆదివారం వీఆర్వోపై భూ కబ్జాదారులు దాడికి పాల్పడ్డారు. మండల పరిధిలోని ఆత్మకూరు వద్ద జాతీయ రహదారిని అనుకుని ఉన్న సర్వే నంబరు 366లో అదే గ్రామానికి చెందిన బొమ్ము ఉమామహేశ్వరరెడ్డితోపాటు మరో ఇద్దరికి ప్రభుత్వం గతంలో 65 సెంట్లకు డీకేటీ పట్టాలు మంజూరు చేసింది. ఈ భూమి రికార్డుల్లో మాత్రం వాగు పోరంబోకుగా నమోదుగా ఉంది. 
 
మంగళగిరికి చెందిన కొందరు అందులోని 20 సెంట్లకు నకిలీ దస్తావేజులు సృష్టించి ఆక్రమించేందుకు ప్రయత్నించగా అనుభవదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను పిలిపించిన పోలీసులు, ఆ భూమి విషయం తేల్చేవరకు అక్కడ అడుగుపెట్టవద్దని హెచ్చరించారు. అధికార పార్టీ నేతల అండతో రెచ్చిపోయిన భూ మాఫియా ఆదివారం స్థలంలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టడంతో స్థానిక తహశీల్దార్ వీఆర్వో శ్రీనివాసరావును పరిశీలనకు పంపారు.
 
వీఆర్ఏ చలపతిరావుతో కలిసి స్థలం వద్దకు వెళ్లిన వీఆర్వో.. నిర్మాణాలు ఆపాలని వారికి సూచించారు. అక్కడే వున్న కరిముల్లాతో పాటు మరో ఐదుగురు రెవెన్యూ సిబ్బందిని దూషించడంతో ఘర్షణ మొదలైంది. ఆ తర్వాత రెచ్చిపోయిన వారు వీఆర్‌వో, వీఆర్ఏలపై దాడి చేశారు. దండం పెడుతున్నా వారిని వదిలిపెట్టలేదు. ఈ సంఘటనపై నిరసన తెలుపుతూ, సోమవారం జిల్లా వ్యాప్తం గా వీఆర్ఏలు, వీఆర్వోలు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు.