శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: మంగళవారం, 24 డిశెంబరు 2019 (19:37 IST)

అమరావతికి స్లో పాయిజన్ ఇచ్చి చంపడం ప్రారంభించారు: బాబుతో అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు

అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు మంగళవారం ఎన్టీఆర్ భవన్‌లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు  నాయుడుతో భేటి అయ్యారు. రాజధానిని ఇక్కడ నుంచి తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై వివిధ సంఘాల ప్రతినిధులు చంద్రబాబు ఎదుట ధ్వజమెత్తారు. ఆయా సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలు వారిమాటల్లోనే...
 
డాక్టర్ శ్రీనివాస రావు(విద్యావంతుల కమిటి ప్రెసిడెంట్): విశాఖలో ఏర్పాటు చేసేది రాజధాని కాదు, అది జగన్మోహన్ రెడ్డి స్పెషల్ ఎకనామిక్ జోన్ మాత్రమే. సీఎం కావడానికి ముందురోజు నుంచే అమరావతికి స్లో పాయిజన్ ఇచ్చి చంపడం ప్రారంభించారు. గేట్లెత్తితే పోయే నీళ్లను ఆపేసి ప్రతిపక్ష నేత ఇంటిమీదకు మళ్లించి అమరావతిని ముంపు ప్రాంతంగా చూపాలని చూశారు. అప్పటినుంచే విశాఖలో తన ఏర్పాట్లన్నీ తాను చేసుకున్నాడు. 
 
వేల ఎకరాలు తనవాళ్లతో ఆక్రమించారు. ఏ వ్యవస్థను లెక్కచేసే స్థితిలో సీఎం జగన్ లేరు. సౌత్ ఆఫ్రికా 3 రాజధానుల ఉదాహరణ ఏపీకి చూపిస్తారా..? సింగపూర్, అమెరికా, జపాన్ సరసన ఏపిని నిలబెట్టాలని చంద్రబాబు ప్రయత్నిస్తే, ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపిని ఇథియోపియాతో, సోమాలియాతో, సౌతాఫ్రికా సరసన నిలబెడుతున్నారు. దళిత నియోజకవర్గంలో, 40% దళిత జనాభా ఉన్న ప్రాంతంలో చంద్రబాబు రాజధానిని పెడితే, ఆ ప్రాంతంపై కమ్మముద్ర వేసి దుష్ప్రచారం చేశారు. 
 
ఒక కులాన్ని టార్గెట్ చేసి అమరావతిని చంపేశానన్న సంబరాల్లో జగన్ ఉన్నారు. 6 నెలల్లో ఆయన చేసిన నియామకాల మాటేమిటి..? మాల మాదిగ, రెల్లి తప్ప మిగిలిన అన్ని కార్పోరేషన్లకు తన కులం వారినే ఛైర్మన్లుగా చేశారు. గతంలో హైదరాబాద్ అంటే చార్మినార్, గోల్కొండ, సాలార్‌జంగ్ మ్యూజియం చారిత్రక అవశేషాల నగరం... ఇప్పుడు హైదరాబాద్ అంటే చార్మినార్, హైటెక్ సిటి, సైబర్ టవర్స్, అవుటర్ రింగ్ రోడ్, శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లతో దానిని లాజిస్టిక్స్ హబ్‌గా, ఉపాధి నగరంగా చేసింది చంద్రబాబే. 
 
ఏసుక్రీస్తు, బందిపోటు బరబ్బాలో ఎవరికి శిలువ వేయాలని ప్రజలను అడిగితే, దేవునిపుత్రుడిగా చెప్పుకునే క్రీస్తుకే శిలువ వేయాలని, బందిపోటు బురబ్బాను వదిలేయాలని చెప్పారని బైబిల్‌లో ఉంది. ప్రజలు తీసుకునే తప్పుడు నిర్ణయాలను పవిత్ర గ్రంథంలో ప్రస్తావించారు. ఆ విధమైన నిర్ణయమే మొన్న ఎన్నికల్లో కూడా జరిగింది. రాజధాని కోసం రాజధాని అమరావతి కాదు, అభివృద్ది కోసం అమరావతి అనే దృష్టితో చంద్రబాబు పనులు చేశారు. వాటిని ఆపేయడం అభివృద్దిని అడ్డుకోవడమే.
 
శివారెడ్డి(క్రెడాయ్): అందరితో చర్చించి అప్పుడు రాజధానిపై నిర్ణయం జరిగింది. అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానించారు. అప్పటి ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి అమరావతిని స్వాగతించారు. ఇప్పటికే చిన్నరాష్ట్రం, ఇంకా విభేదాలు తేకూడదు, మరిన్ని ముక్కలు కాకూడదు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టడం ఇష్టంలేకే రాజధానిగా అమరావతిని స్వాగతిస్తున్నానంటూ, గొప్పనగరం కట్టాలంటే 30వేల ఎకరాలు కావాలని కూడా అడిగారు. అలాంటిది ఇప్పుడు వైసిపి ప్రజాప్రతినిధులు మాట్లాడలేని పరిస్థితి వచ్చింది. 
 
4 ఏళ్ల తరువాత మీరు, మీ కుటుంబ సభ్యులు ఈ ప్రాంతంలోనే ఉండాలి. అధికారంలో ఒకలా, ప్రతిపక్షంలో ఒకలా మాట్లాడటం కరెక్ట్ కాదు. మౌనంగా ఉంటే సమాజానికి నష్టం. పరిపాలకుడికి ధర్మగుణం ఉండాలి, న్యాయ స్వభావం ఉండాలి. ఆ రోజు ఇక్కడ రాజధాని పెట్టమని ఈ ప్రాంతం వాళ్లు అడగలేదు. 
 
కానీ ఈ నిర్ణయాన్ని అన్ని ప్రాంతాలవారు స్వాగతించారు. ఇప్పుడీ ప్రభుత్వ నిర్ణయాల వల్ల రాయలసీమ వాళ్లు విశాఖకు వెళ్లాలా..? ఉత్తరాంధ్రవాళ్లు కోర్టుకు కర్నూలు వెళ్లాలా..? మాకు 25 సీట్లు ఇవ్వండి ప్రత్యేక హోదా సాధిస్తానని ఆ రోజు చెప్పి, 22 ఎంపిలు ఇచ్చాక ప్రత్యేక హోదా గురించి ఎత్తకుండా, 3 రాజధానుల పల్లవి అందుకుంటారా..? నిన్న మంత్రిగారికి వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తే మమ్మల్ని పోలీస్ స్టేషన్లన్నీ తిప్పారు, గంటల తరబడి స్టేషన్లలో ఉంచారు. విద్యార్ధులపై గంజాయి కేసులు పెడుతున్నారు. 
 
డాక్టర్ నందకిషోర్: ఇండియాకే ఒక రాజధాని ఉంటే ఏపికి 3 రాజధానులా..? ఎటువంటి హింస లేకుండా 34 వేల ఎకరాల భూములు ఇవ్వడం చరిత్రలో లేదు. విశాఖ, నెల్లూరులో పోర్టులు, సీమలో పరిశ్రమలు, అమరావతిలో రాజధాని, తిరుపతిలో హార్డ్‌వేర్ హబ్, కర్నూలులో సీడ్ హబ్, కడపలో సోలార్ విండ్ పవర్ ప్లాంట్లు, గోదావరిలో అగ్రి ఇండస్ట్రీలు ఒక పద్దతి ప్రకారం మీరు అభివృద్ది చేశారు. దానిని కొనసాగించకుండా ఈవిధంగా రాజధాని మార్పుపై రకరకాల ప్రకటనలతో మభ్యపెడుతున్నారు.
 
డాక్టర్ కార్తీక్: మనిషికి ఒకటే తల ఉంటుంది. అలాగే ఒకే రాజధాని ఉండాలి. సీజన్‌కో కేపిటల్, ప్రాంతానికో కేపిటల్ సరైందికాదు. రాజధాని ఇక్కడే, కానీ పరిపాలన మాత్రం విశాఖ నుంచి అనడం సరైందికాదు. రైతులే ఈ 5 జిల్లాలకు ఆధారం. భూమి వాళ్లకు కన్నతల్లి. అలాంటిది రైతులకు అన్యాయం చేయడం బాధాకరం.