కసాయిని నమ్మినట్టు కేసీఆర్ను తెలంగాణ ప్రజలు నమ్మారు : రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమత్రి కేసీఆర్ను ఆ రాష్ట్ర ప్రజలు కసాయిని నమ్మినట్టు నమ్మారని టీ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. తిరుపతిలో జరుగుతున్న టీడీపీ మహానాడు చివరి రోజైన ఆదివారం ఆయన ప్రసంగిస్తూ... అబద్దాలతోనే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని దుయ్యబట్టారు.
ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఒక కసాయిని నమ్మినట్టు కేసీఆర్ను నమ్మారని వాపోయారు. రిజర్వేషన్ల శాతం పెంచేవరకు ఉద్యోగాల్లో గిరిజనులు, మైనార్టీలు, వికలాంగుల వాటా పక్కనపెట్టాలని ఆయన కోరారు. తెలంగాణ కోసం పోరాడిన 690 అమరుల కుటుంబాల అడ్రస్ దొరకడంలేదనడం దారుణమన్నారు.
తెలంగాణలో రెండేళ్లలో రూ.2.5 లక్షల కోట్లు ఖర్చుచేశారు కాని అభివృద్ధి శూన్యమని ఆయన అన్నారు. టీడీపీ వల్లే తెలంగాణలో సామాజిక న్యాయం జరుగుతోందని ఆయన అన్నారు. 2019 ఎన్నికల్లో మిషన్ 99 టార్గెట్గా పనిచేస్తామన్నారు. తెలంగాణాలో టీడీపీని ఏ శక్తీ ఏమీ చేయలేదన్నారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతామని రేవంత్ ఈ సందర్భంగా ప్రకటించారు.